మూడేళ్ల బాలుడిని కుర్చీకి కట్టేసి హింస?

న్యూఢిల్లీ: మూడేళ్ల చిన్నారికి రక్షణ కల్పించాల్సిన ప్లే స్కూల్‌లోనే అతడిని కుర్చీకి కట్టేసి హింసించారంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడం తీవ్ర కలకలం రేపింది. న్యూఢిల్లీలోని మోజ్‌పూర్‌లో వెలుగుచూసిన ఈ ఘటనపై పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఈ కేసులో ప్లేస్కూల్‌లో పనిచేస్తున్న ఆయాను ఇప్పటికే అరెస్టు చేశారు. మరోవైపు ఓ టీచర్‌, ప్రిన్సిపాల్‌, డైరెక్టర్‌పై కూడా పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కొన్ని రోజులుగా తమ మూడేళ్ల కుమారుడి ప్రవర్తనలో అనూహ్యమైన మార్పులు కనిపించడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. బాలుడిని పరిశీలించగా శరీరంపై గాయాల గుర్తులు కనిపించడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలుడిని ఎవరైనా కొట్టి ఉండే అవకాశం ఉందని వైద్యుడు అనుమానం వ్యక్తం చేసినట్లు తల్లిదండ్రులు తెలిపారు. అంతేకాకుండా బాలుడి రెండు చెవుల లోపలి భాగాలు వాచినట్లు వైద్యులు గుర్తించినట్లు పేర్కొన్నారు.

ఇంతకుముందు చాలా రోజులుగా బాలుడు బాత్రూమ్‌కు వెళ్లేందుకు సైతం భయపడేవాడని తల్లిదండ్రులు వెల్లడించారు. రాత్రివేళల్లో ఆపకుండా ఏడుస్తూ ఉండేవాడని, అయితే కారణం చెప్పలేకపోయేవాడని తెలిపారు. అసలు ప్లే స్కూల్‌లో ఏం జరిగిందో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరగా రూ.1,500 చెల్లించాలని డిమాండ్ చేసినట్లు తండ్రి ఆరోపించారు. బాలుడిని కుర్చీకి కట్టేసి హింసించారన్న ఆరోపణలపై పోలీసులు సీసీటీవీ ఫుటేజీతో పాటు ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు. చిన్నారిపై నిజంగా ఏం జరిగిందనే విషయాన్ని దర్యాప్తు పూర్తయ్యే వరకు నిర్ధారించలేమని పోలీసులు చెబుతున్నారు.

You may also like...