బాన్సువాడలో ‘SIR’ నోటీసుల కలకలం..ఓటర్లకు పరుగులు

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ బాన్సువాడలో వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే నియోజకవర్గ పరిధిలో SIR ప్రక్రియ దాదాపు 90 శాతం పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు.బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గంలో 19 వేలకు పైగా ఓటర్లకు నోటీసులు జారీ కాగా, బాన్సువాడ పురపాలక పరిధిలో మొత్తం 24 వేల ఓట్లకు గాను సుమారు 7,500 మంది ఓటర్లకు నోటీసులు అందాయి.2002 నాటి ఓటర్ల జాబితాతో ప్రస్తుత వివరాలు సరిపోలకపోవడం, పేర్లు, వివరాల్లో తేడాలు ఉండటం, అలాగే ఐదుగురికి మించి ఓటర్ల మ్యాపింగ్ జరిగిన సందర్భాల్లో నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ బూత్‌ల వారీగా బీఎల్‌ఓలు నోటీసులను పంపిణీ చేస్తున్నారు.నోటీసులు అందుకున్న ఓటర్లు నిర్ణీత గడువులోగా సంబంధిత ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ సూచించారు. గడువులోగా స్పందించకపోతే ఓటర్ల జాబితాలో పేరు కొనసాగింపుపై ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు.నోటీసుల నేపథ్యంలో బాన్సువాడ మున్సిపల్ కార్యాలయానికి ఓటర్లు పెద్ద సంఖ్యలో చేరడంతో సందడి నెలకొంది. ప్రతి వార్డులో సుమారు 300 మంది వరకు ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.ప్రజలు ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా తమకు కేటాయించిన బీఎల్‌ఓలను సంప్రదించి అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని కమిషనర్ గంగాధర్ కోరారు. సందేహాలుంటే సంబంధిత వార్డు కౌన్సిలర్ లేదా అధికారులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు.

You may also like...