వాయిదాల పర్వంతోముగిసిన పార్లమెంటు సమావేశాలు
- గురుకుల అడ్మిషన్ల పేరుతో వసూళ్లు? - August 13, 2026
- వాయిదాల పర్వంతోముగిసిన పార్లమెంటు సమావేశాలు - August 13, 2026
- ప్రభుత్వ భూములు అమ్మకాలకేనా? - August 13, 2026

జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ ప్రతినిధి :
జులై 20 నుంచి 19 రోజుల పాటు వాయిదాల పర్వంతో కొనసాగిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారంతో ముగిశాయి. చివరి రోజు మైన్స్ అండ్ మినరల్స్ బిల్లును రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించిన అనంతరం ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేశారు. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాలు, నిరసనలు చోటుచేసుకున్నాయి. సభా కార్యకలాపాలు పలుమార్లు స్తంభించడంతో ఆశించిన స్థాయిలో చర్చలు జరగలేదనే విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ సమావేశాల్లో మైన్స్ అండ్ మినరల్స్ బిల్లుతో కలిపి మొత్తం 12 బిల్లులకు పార్లమెంటు ఆమోదముద్ర వేసింది. పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు, యాంటీ పేపర్ లీక్ బిల్లు, వందేమాతరం బిల్లు, కేరళం బిల్లుతో పాటు పలు కీలక ప్రతిపాదనలకు సభలు ఆమోదం తెలిపాయి. అయితే ఎఫ్సీఆర్ఐ బిల్లును మాత్రం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు. మరికొన్ని కీలక బిల్లులు సభ ముందుకు వచ్చినా, నిరసనలు మరియు రాజకీయ ఉద్రిక్తతల కారణంగా వాటిపై సమగ్ర చర్చకు అవకాశం లేకుండా పోయింది.
నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల నిరసనలపై జరిగిన లాఠీచార్జ్, అయోధ్య రామమందిరం విరాళాల అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. ఈ అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధం కావాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు నిరసనలు చేపట్టడంతో సభా కార్యకలాపాలు పలుమార్లు నిలిచిపోయాయి. అధికార, విపక్ష సభ్యుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో పార్లమెంటు వాతావరణం వేడెక్కింది.
విపక్షాల నిరసనల ప్రభావంతో కీలకమైన డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశాల్లో మరోసారి ప్రవేశపెట్టలేకపోయింది. దేశ రాజకీయ, పరిపాలనా వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అంశాలపై చర్చ జరగకపోవడం పట్ల రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సమస్యలపై సమగ్ర చర్చకు పార్లమెంటు వేదిక కావాల్సి ఉండగా, రాజకీయ ప్రతిష్టంభనతో విలువైన సమయం వృథా అయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇక సమావేశాల చివరి రోజు లోక్సభలో మరో ప్రత్యేక ఘట్టం చోటుచేసుకుంది. పార్లమెంటు చరిత్రలో తొలిసారిగా జాతీయ గేయం ‘వందేమాతరం’ గీతాలాపనతో లోక్సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు సభ్యులు సభకు హాజరై వందేమాతరం ఆరు చరణాలను ఆలపించారు. అనంతరం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేశారు.
వందేమాతరాన్ని అవమానిస్తే క్రిమినల్ చర్యలు తీసుకునే బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇటీవల ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ అంశానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. వందేమాతరం గీతాలాపన సమయంలో ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే నిబంధనలు ఇందులో ఉన్నాయి. దీంతో పార్లమెంటు చివరి రోజు కార్యక్రమాలు రాజకీయంగానే కాకుండా జాతీయ భావోద్వేగాలకు సంబంధించిన అంశంగానూ చర్చనీయాంశమయ్యాయి.
లోక్సభ నిరవధిక వాయిదా అనంతరం స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేసిన తేనేటి విందుకు విపక్ష సభ్యులు గైర్హాజరయ్యారు. అయితే డీఎంకే సభ్యురాలు కనిమొళి మాత్రం విందుకు హాజరయ్యారు. మొత్తంగా 19 రోజుల పాటు సాగిన వర్షాకాల సమావేశాలు ఆందోళనలు, వాయిదాలు, రాజకీయ ఆరోపణలు, పరిమిత చర్చల మధ్య ముగిశాయి. ప్రజా సమస్యలపై విస్తృత చర్చ జరగాల్సిన పార్లమెంటు వేదిక రాజకీయ ప్రతిష్టంభనకు కేంద్రంగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య భేదాభిప్రాయాలు కొనసాగుతున్న నేపథ్యంలో తదుపరి సమావేశాల్లోనైనా కీలక బిల్లులు, పెండింగ్ అంశాలపై సార్థక చర్చ జరుగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
