శ్రీశైలానికి లక్షన్నర క్యూసెక్కుల వరద.. నేడు 100 టీఎంసీల అంచనా
- ప్రజల్లోనే ఉండాలి.. పథకాలే పార్టీకి బలం: బొల్లారం వెంకట్రెడ్డి - August 4, 2026
- ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉచ్చు బిగుస్తోంది - August 4, 2026
- యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగాలే లక్ష్యం - August 4, 2026

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి:
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, ఆలమట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నుంచి భారీగా నీటి విడుదలతో శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. సోమవారం రాత్రి నాటికి జలాశయానికి 1.55 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. దీంతో జలాశయంలో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది.
ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 855.10 అడుగులకు, నిల్వ 92.048 టీఎంసీలకు చేరుకుంది. ఇదే స్థాయిలో వరద ప్రవాహం కొనసాగితే మంగళవారం సాయంత్రానికి నిల్వలు 100 టీఎంసీల మార్కును దాటే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
జూరాల ప్రాజెక్టు నుంచి 2.21 లక్షల క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. మరోవైపు కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు భారీ ఇన్ఫ్లో కొనసాగుతుండటంతో రానున్న రోజుల్లో కూడా వరద ఉద్ధృతి తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
