శంకర్‌పల్లి జెడ్పీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు శానిటరీ ప్యాడ్స్‌, యూనిఫార్మ్స్‌, షూస్‌ పంపిణీ

జ్ఞానతెలంగాణ, శంకర్‌పల్లి, ఆగస్టు 14: శంకర్‌పల్లిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల బాలికల పాఠశాలలో విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని శుక్రవారం శానిటరీ ప్యాడ్స్‌, యూనిఫార్మ్స్‌, షూస్‌ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వేదశ్రీ, పాఠశాల చైర్మన్‌ పజిల్లా చేతుల మీదుగా విద్యార్థులకు సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు వేదశ్రీ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతతో పాటు విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ప్రశంసనీయమన్నారు. పాఠశాలల్లో అందిస్తున్న అల్పాహారం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్యతో పాటు అవసరమైన మౌలిక వసతులు, సంక్షేమ సదుపాయాలు అందుతున్నాయని పేర్కొన్నారు. ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలు నాణ్యమైన విద్యను అందిస్తూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం ఉంచి తమ పిల్లలను చేర్పించాలని, అందుబాటులో ఉన్న విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...