శంకర్పల్లి విషాదం ప్రకృతి ప్రభావంతో క్రేన్ ప్రమాదం

శంకర్పల్లి విషాదం-
ప్రకృతి ప్రభావంతో క్రేన్ ప్రమాదం
జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ NCC Limited కు చెందిన ప్రాజెక్ట్లో మధ్యాహ్నం సుమారు రెండున్నర గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా వీసిన తీవ్ర గాలుల ప్రభావంతో, భద్రతా ప్రమాణాలు పాటించినప్పటికీ భారీ క్రేన్ అదుపుతప్పి కూలిపోవడంతో అక్కడి పరిస్థితి విషాదకరంగా మారింది.
ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందినట్లు సమాచారం. మరో పదిమంది తీవ్రంగా గాయపడగా, వారిని సమీప ఆసుపత్రిలో అత్యవసర చికిత్స కోసం తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుంటే, మృతుల సంఖ్య పెరిగే అవకాశంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ ప్రాజెక్ట్లో పనిచేస్తున్న కార్మికులు ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందినవారిగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో వాతావరణ పరిస్థితులు అకస్మాత్తుగా మారి గాలి వేగం తీవ్రంగా పెరగడం ప్రధాన కారణంగా భావిస్తున్నారు. సమాచారం ప్రకారం, క్రేన్కు అవసరమైన భద్రతా లాకింగ్ వ్యవస్థ అమలులో ఉన్నప్పటికీ, అనూహ్యంగా వచ్చిన గాలుల తీవ్రత కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
యాజమాన్యం వెంటనే స్పందించి సహాయక చర్యలను ప్రారంభించింది. గాయపడిన వారికి తక్షణ వైద్యం అందించడమే కాకుండా, సంఘటనా స్థలంలో రక్షణ చర్యలను వేగవంతం చేసింది. క్రేన్ కింద ఎవరైనా చిక్కుకుని ఉన్నారా అనే విషయంపై కూడా పరిశీలనలు కొనసాగుతున్నాయి.



