లాటరీ గెలిచినా.. తనిఖీలో తేలాల్సిందే

ఇందిరమ్మ ఇళ్ల లాటరీలో పేరు వచ్చిందని సంబరపడితే సరిపోదు. క్షేత్రస్థాయి పరిశీలనలో అర్హత సాధిస్తేనే ఇల్లు దక్కనుంది. దరఖాస్తు చేసుకున్న నియోజకవర్గంలోనే నివాసం ఉండటంతో పాటు అవసరమైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలి. హౌసింగ్ బోర్డు అధికారులు 16 నియోజకవర్గాల్లో లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారుల ఇళ్లను ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా తనిఖీ చేస్తున్నారు.లబ్ధిదారులు అద్దె ఇంట్లో ఉంటున్నారా, ఇంటి నిర్మాణం ఎలా ఉంది, ఎంతకాలంగా అక్కడ నివసిస్తున్నారు, కుటుంబ సభ్యుల వివరాలు, ఇంటి ఫొటోలు వంటి సమాచారాన్ని అధికారులు నమోదు చేస్తున్నారు. దరఖాస్తు సమయంలో పత్రాలు తీసుకోకపోవడంతో వాస్తవ పరిస్థితులను నిర్ధారించేందుకు ఈ పరిశీలనలు చేపట్టారు. శేరిలింగంపల్లిలో లాటరీలో ఎంపికైన ఓ మహిళ ప్రస్తుతం కూకట్‌పల్లిలో నివసిస్తున్నట్లు గుర్తించి అనర్హురాలిగా తేల్చారు. మరోచోట కుల ధ్రువీకరణ పత్రం లేకపోవడంతో లబ్ధిదారురాలి పేరును తొలగించారు. ఖైరతాబాద్‌లో ఎంపికైన వారిలో 60 శాతం మంది ఇతర నియోజకవర్గాలకు చెందినవారిగా గుర్తించడంతో 80 మంది అధికారుల బృందం ఇంటింటికీ వెళ్లి వివరాలను ధ్రువీకరిస్తోంది. దీంతో అర్హుల తుది జాబితాలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

You may also like...