దేశవ్యాప్తంగా బీజేపీ విధానాలపై కాంగ్రెస్ ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. తొలివిడతలో మీడియా సమావేశాల ద్వారా బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలు ఎండగట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆదివారం రాత్రి అన్ని రాష్ట్రాలకు 57 మంది అధికార ప్రతినిధులను ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. విజయవాడ-వారాణసీ, కాశ్మీర్-తిరువనంతపురం వరకు స్వాతంత్య్ర పోరాట సజీవ స్మారక చిహ్నాన్ని ధ్వంసం చేయడానికి బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని కాంగ్రెస్ స్పష్టం చేసింది. సోమవారం నుంచి గురువారం(ఈనెల 24) వరకు దేశంలోని 57 నగరాల్లో మీడియా సమావేశాలను నిర్వహించేలా.. తాజాగా ప్రకటించిన అధికార ప్రతినిధులను ఆదేశించింది. తెలంగాణకు కాంగ్రెస్ సీనియర్ నేత రణ్దీప్ సింగ్ సూర్జేవాలా, ఆంధ్రప్రదేశ్కు సీనియర్ నేతలు మాణిక్కంఠాకూర్, సాల్మాన్ సోజ్, కేరళకు కొప్పుల రాజును నియమించింది. ఏపీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు సహా పలు రాష్ట్రాలకు రెండు కంటే ఎక్కువ మంది నేతలను ఎంపిక చేసింది. వీరంతా నాలుగు రోజుల పాటు ఆయా రాష్ట్రాల్లో మీడియా సమావేశాల ద్వారా బీజేపీ తీరును ఎండగట్టనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై దర్యాప్తు సంస్థల కేసులపైనా నిజాలను ప్రజలకు వివరించాలని అధికార ప్రతినిధులకు సూచించింది.