జనగామ శక్తి డైరీలో భారీ పేలుడు – ఇద్దరికీ తీవ్ర గాయాలు

జనగామ శక్తి డైరీలో భారీ పేలుడు – ఇద్దరికీ తీవ్ర గాయాలు
జ్ఞానతెలంగాణ,జనగామ టౌన్ ప్రతినిధి(నరేష్):జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం గోవర్ధనగిరి గ్రామంలోని శక్తి డైరీలో గురువారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. డైరీలోని ఓవెన్ చాంబర్ పూర్తిగా చల్లారకముందే తెరవడంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు జరిగినట్లు ప్రాథమిక సమాచారం. పేలుడు తీవ్రతకు అక్కడ నిల్వ ఉంచిన బాదం సీసాలు పగిలిపడి గాజు ముక్కలు ఎగిరి చుట్టుపక్కల ఉన్న కార్మికులపై పడ్డాయి. ఈ ఘటనలో వివేక్ మరియు రామ్ గోపాలవర్మ తీవ్రంగా గాయపడ్డారు. గాజు ముక్కలు వారి శరీరాల్లోకి దిగడంతో రక్తస్రావం ఎక్కువగా జరిగినట్లు తెలుస్తోంది.
సహచర కార్మికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు రిఫర్ చేశారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.
సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ నరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే ప్రమాదానికి కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
