నేడు చేవెళ్లలో బిఆర్ఎస్ ఆందోళనలు

- కేటీఆర్ ఆదేశాలు – సబితా పిలుపు
- కాంగ్రెస్ చేస్తున్న కాళేశ్వరం కుట్రపై చేవెళ్లలో బిఆర్ఎస్ ఆందోళనలు
- ఈరోజు ఉదయం 10 గంటలకు మండల కేంద్రంలో ధర్నాలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీలు
జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల:
బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావ్ ఆదేశాల మేరకు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపుతో ఈరోజు ఉదయం 10 గంటలకు చేవెళ్ల మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఆందోళనలు జరుగుతున్నాయి.కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కాళేశ్వరం కుట్రలపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ధర్నాలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీలు చేపట్టనున్నారు.ఈ విషయాన్ని మండల పార్టీ అధ్యక్షుడు పెద్దొళ్ళ ప్రభాకర్ పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తూ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు–ఉపాధ్యక్షులు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్లు, మాజీ డైరెక్టర్లు, మాజీ వార్డు సభ్యులు, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు, ఏఎంసీ చైర్మన్లు, మాజీ జెడ్పిటిసీలు, మాజీ ఎంపీపీలు, గ్రామ శాఖ అధ్యక్షులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఇక నియోజకవర్గం నలుమూలల నుండి బిఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు కార్యకర్తలు ఊరూఊరున ప్రచారం చేస్తూ, ట్రాక్టర్లు, బైక్ ర్యాలీల రూపంలో సమూహాలుగా చేవెళ్ల కేంద్రానికి చేరుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు గ్రామాల్లో కార్యకర్తలు గుంపులుగా బయలుదేరగా, ఆందోళన వేదికపై బిఆర్ఎస్ శక్తి ప్రదర్శన కనిపించేలా వేడెక్కిన వాతావరణం నెలకొంది. ఈ ఆందోళనతో కాంగ్రెస్ కుట్రలను బహిర్గతం చేయడమే కాకుండా, ప్రజల ముందర బిఆర్ఎస్ బలాన్ని చూపించేందుకు పార్టీ శ్రేణులు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు.
