అక్రమ సంబందం అవసరమా..!! కుటుంబం ఆగమైపాయే…!!!
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

జ్ఞానతెలంగాణ,సూర్యాపేట జిల్లా ప్రతినిధి :
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూర్ గ్రామానికి చెందిన కొరివి మల్లయ్య, బిక్ష్మమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. మల్లయ్య డ్రైవర్గా పని చేస్తున్నాడు.కొద్దీ రోజులుగా భార్య బిక్ష్మమ్మ సమీప గ్రామానికి చెందిన మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. నడవడిక మార్చుకొమ్మని పలుమార్లు హెచ్చరించినా బిక్ష్మమ్మలో మార్పు రాలేదు. దీంతో కుటుంబ పరువు పోతోందని, పెళ్ళీడుకొచ్చిన కుమారులకు సంబంధాలు రావడం లేదని భర్త మల్లయ్య భావించాడు. బిక్ష్మమ్మ వ్యవహార శైలితో గ్రామంలో పరువు పోతుందని కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఎలాగైనా పరువు దక్కించుకునేందుకు బిక్ష్మమ్మను అడ్డు తొలగించుకోవాలని భర్త మల్లయ్య, కొడుకులు ప్రవీణ్, భరత్లు కన్న తల్లికి మరణ శాసనం రాశారు. బిక్షమ్మ హత్యకు మల్లయ్య.. అన్న కుమారుడు మహేష్, అతడి ఫ్రెండ్స్ వంశీ, జనార్దన్లతో కలిసి స్కెచ్ వేశారు. గ్రామంలోనే నడిరోడ్డుపై బిక్షమ్మను కర్కశంగా కత్తితో గొంతుకోసి హత్య చేశారు. రోడ్డుపై వెళ్తున్న బిక్ష్మమ్మను బైక్పై వచ్చిన జనార్ధన్ అడ్డగించాడు. వెంటనే కారులో వచ్చిన మహేష్, వంశీలు కత్తులతో బిక్ష్మమ్మను గొంతుకోసి పొడిచి హత్య చేశారు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పదేపదే హెచ్చరించినా బిక్ష్మమ్మలో మార్పు రాలేదని, గ్రామంలో ఎలాగైనా పరువు దక్కించుకోవాలని నిందితులు పథకం ప్రకారం హత్య చేశారని సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్ తెలిపారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేయడంతో పాటు కారు, రెండు బైక్స్, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని డిఎస్పి చెప్పారు. కుటుంబ పరువు కోసం కన్నవాళ్ళే హత్యకు పాల్పడడం ఆత్మకూర్ మండలంలో తీవ్ర చర్చనీయాంగా మారింది.
