స్వేచ్ఛా స్ఫూర్తికి ఆజరామర దీప్తి జతీంద్రనాథ్ దాస్.
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026
- బెల్జియంపై విజయం.. ఫిఫా వరల్డ్కప్ సెమీస్లోకి స్పెయిన్ - July 11, 2026

నేడు అమరవీరుడు జతీంద్రనాథ్ దాస్ 121 వ జయంతి
– అరియ నాగసేన బోధి
భారత స్వాతంత్ర్య పోరాటం కేవలం యుద్ధం లేదా రాజకీయ ఉద్యమం మాత్రమే కాదు. అది న్యాయం, సమానత్వం, స్వాభిమానానికి సాగిన మహత్తర యజ్ఞం. ఆ యజ్ఞంలో తన ప్రాణాన్ని అర్పించిన జతీంద్రనాథ్ దాస్ పేరు, భారత చరిత్రలో అక్షరాలా బంగారు అక్షరాలతో చెక్కబడి ఉంది.1904 అక్టోబర్ 27న బెంగాల్లోని కలకత్తాలో జన్మించిన జతీంద్రనాథ్ దాస్ చిన్న వయసులోనే విప్లవాత్మక ఆలోచనలకు లోనయ్యాడు. భగత్సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు వంటి మహనీయుల సాహచర్యంలో ఆయన భారత స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించాడు.
లాహోర్ జైలులో నిరాహార దీక్ష:
1929లో జతీంద్రనాథ్ దాస్, ఇతర విప్లవకారులతో కలిసి లాహోర్ కుట్ర కేసులో జైలుకు పంపబడ్డాడు. జైలులో భారత ఖైదీలకు అమానుషమైన వాతావరణం, అన్యాయం, వివక్షత కొనసాగుతుండగా ఆయన స్వీయ గౌరవం కోసం పోరాడాడు. 13 జూలై 1929న ఆయన ఆహార నిరాహార దీక్ష ప్రారంభించాడు. ఆ దీక్ష కేవలం ఆహారం కోసం కాదు. దేశ భక్తుల గౌరవం, న్యాయం కోసం ప్రారంభమైన మానవతా పోరాటం.
63 రోజుల అసాధారణ త్యాగం :
జతీంద్రనాథ్ దాస్ శరీరం క్షీణించింది కానీ సంకల్పం మాత్రం దృఢమైంది. వైద్యులు, సహచరులు, అధికారులు ఆయనను బలవంతంగా ఆహారం తీసుకోమని ఒత్తిడి చేసినా, ఆయన మాట ఒక్కటే : “నేను న్యాయముగా భావించిన మార్గం నుంచి వెనక్కు తగ్గను.”63 రోజుల అనంతరం, 13 సెప్టెంబర్ 1929న ఆయన బలిదానం భారత స్వాతంత్ర్య చరిత్రను కదిలించింది. ఆయన మృతదేహాన్ని తీసుకెళ్తున్న రైలు దేశమంతా దుఃఖ సముద్రంగా మారింది.
భగత్సింగ్ కన్నీటి వీడ్కోలు :
భగత్సింగ్ వంటి ఉక్కు మనిషి కూడా జతీంద్రనాథ్ దాస్ శవాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నాడు. “జైల్లో ఉన్నప్పటికీ, జతీంద్ర యొక్క మరణం ఒక మహాస్వరం లాగా దేశాన్ని మేల్కొలిపింది.”
వీరుని త్యాగం ఇచ్చిన ప్రేరణ :
జతీంద్రనాథ్ దాస్ త్యాగం తర్వాత, భారత యువతలో విప్లవ భావాలు మరింత గాఢమయ్యాయి. ఆయన మరణం బ్రిటిష్ దమన విధానాలపై ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
జతీంద్రనాథ్ దాస్ మనకు ఇచ్చిన సందేశం : “న్యాయం కోసం పోరాడటం అంటే జీవితం అంతా త్యాగమే అయినా సరే, మనసు వెనక్కు తగ్గకూడదు.” ఈరోజు జతీంద్రనాథ్ దాస్ జయంతి సందర్భంగా మనం తలచుకోవలసినది ఏమిటనగా జతీంద్రనాథ్ దాస్ లాంటి వీరుల రక్తంతోనే మనకు లభించిన స్వేచ్ఛ విలువైనది. ఆ త్యాగాన్ని గౌరవించడం అంటే సమాజంలో న్యాయం, సమానత్వం నిలపడం.
జతీంద్రనాథ్ దాస్ ఆత్మస్ఫూర్తి భారత యువతలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి, న్యాయం కోసం నడిపే దీప్తిగా మారాలని మనసారా కోరుకుందాం.
అమర్ రహే జతీంద్రనాథ్ దాస్
