ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

- కొలువుల పండుగలో 1,370 గ్రూప్–III నియామక పత్రాల పంపిణీ
- విద్య–నైపుణ్యాలతో యువతను ప్రపంచ పోటీకి సిద్ధం చేస్తాం
- తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యం
రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు ప్రైవేటు రంగంలో కూడా ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో యువతను తీర్చిదిద్దే సమగ్ర కార్యక్రమాలను అమలు చేస్తామని తెలిపారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో “కొలువుల పండుగ”లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో 25 శాఖలకు సంబంధించిన గ్రూప్–IIIలో ఎంపికైన 1,370 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను ముఖ్యమంత్రి లాంఛనంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న వారంతా రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. పరిపాలనలో నిజమైన ప్రక్షాళన జరగాలంటే ఉద్యోగులు సంపూర్ణంగా సహకరించాలని, చిత్తశుద్ధితో పనిచేస్తేనే తెలంగాణను దేశంలోనే అత్యధికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దగలమని పేర్కొన్నారు. తాను 30 నుంచి 35 సంవత్సరాల పాటు తెలంగాణ కోసం తలవంచకుండా పనిచేశానని గర్వంగా చెప్పుకునేలా ప్రతి ఉద్యోగి కూడా ప్రజల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగం ఒక సాధారణ ఉపాధి కాదని, అది ఒక భావోద్వేగమని, ఈ భావోద్వేగమే తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఉద్యోగులను భాగస్వాములుగా చేస్తుందని అన్నారు. నాలుగు కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే గొప్ప బాధ్యతను మీరు తీసుకోబోతున్నారని, అందుకే ప్రజల పట్ల సానుభూతి, బాధ్యతాభావం అత్యంత అవసరమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత ఉద్యోగ నియామకాలు జరుగుతాయని ప్రజలు ఆశించారని, కానీ 2014 నుంచి 2024 వరకు పదేళ్ల పాటు సరైన నియామకాలు జరగలేదని గుర్తు చేశారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 14 సంవత్సరాల పాటు గ్రూప్–I నియామకాలు కూడా చేపట్టలేదని పేర్కొన్నారు. అయితే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితిని పూర్తిగా మార్చామని, తొలి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసి దేశంలోనే అరుదైన ఘనత సాధించామని తెలిపారు. గడిచిన రెండేళ్లలో మొత్తం 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, టీజీపీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేసి గ్రూప్–I, II, III, IV నియామకాలను ఒక యజ్ఞంలా నిర్వహించామని వివరించారు. ప్రస్తుతం విద్య అన్ని ప్రాంతాలకు విస్తరించినప్పటికీ నాణ్యమైన విద్య అందడంలో లోపం ఉందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 16.5 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా, 11 వేల ప్రైవేటు పాఠశాలల్లో 33 లక్షల మంది విద్యను అభ్యసిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో 1.20 లక్షల మంది అర్హత కలిగిన ఉపాధ్యాయులు పనిచేస్తున్నప్పటికీ ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పరిస్థితికి గల కారణాలను మనమే విశ్లేషించుకోవాలని, పేదలకు నాణ్యమైన విద్య అందించాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వంతో పాటు సమాజంపై కూడా ఉందని స్పష్టం చేశారు. నాణ్యమైన విద్య, అవసరమైన నైపుణ్యాలు లేకపోవడం వల్ల అంతర్జాతీయ అవకాశాలు ఉన్నప్పటికీ వాటిని అందిపుచ్చుకోలేని పరిస్థితి ఏర్పడుతోందని, గతంలో మాదిరిగా పేదలకు పంచడానికి ప్రభుత్వానికి భూములు లేవని, అందుకే జీవితంలో మార్పు తీసుకొచ్చేది విద్య ఒక్కటేనని అన్నారు. చదువే మనిషికి గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుందని, విద్య ద్వారానే పేదరికం నుంచి బయటపడగలమని చెప్పారు.
స్వాతంత్య్రం సాధించిన వందేళ్ల నాటికి భారత్ ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యాన్ని దేశం నిర్దేశించుకుందని, అందులో భాగంగా తెలంగాణ 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఇప్పుడు ఉద్యోగాల్లో చేరుతున్నవారంతా 2047 నాటికీ ప్రభుత్వ సేవల్లో కొనసాగుతారని, అందువల్ల ఈ లక్ష్యాల సాధనలో మీ పాత్ర కీలకమని సీఎం గుర్తు చేశారు. ప్రజలు, ముఖ్యంగా పేదవారు మీ వద్దకు వచ్చినప్పుడు, మీ సొంత తల్లిదండ్రులు వచ్చినట్లే గౌరవంగా స్పందించాలని, తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోని వారు ఎవరైనా ఉంటే వారి జీతంలో 10 నుంచి 15 శాతం కోత విధించి ఆ మొత్తాన్ని తల్లిదండ్రుల ఖాతాలో జమ చేసే విధానాన్ని కూడా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎంపికైన అభ్యర్థులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్, సలహాదారు వేమ్ నరేందర్ రెడ్డి, మహమ్మద్ అలీ షబ్బీర్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు గారు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



