హెచ్1బీ వీసా రిజిస్ట్రేషన్స్ ప్రారంభం

హెచ్1బీ వీసా రిజిస్ట్రేషన్స్ ప్రారంభం
ప్రతిభ ఉన్న నిపుణుల కోసం అగ్రరాజ్యం అమెరికా ఆహ్వానిస్తుంది.
నైపుణ్యం కలిగిన నిపుణులకు అమెరికాలో పనిచేసే అవకాశాన్ని కల్పించేందుకు 2026లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న H-1B వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుండి ప్రారంభమైంది. ఈ క్రమంలో అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 22, 2025 వరకు కొనసాగుతుందని ప్రకటించారు. H1బీ వీసాలకు అధిక డిమాండ్ ఉన్న నేపథ్యంలో దరఖాస్తుదారులు, వారి స్పాన్సర్ యజమానుల ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు ముందుగానే సిద్ధంగా ఉండాలని సూచించారు.
H-1B వీసా అంటే ఏంటి?
H-1B వీసా అనేది వలసేతర వీసా. ఇది US కంపెనీలకు సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే వృత్తులలో విదేశీ కార్మికులను నియమించుకోవడానికి అనుమతిస్తుంది. ఈ వీసా ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, హెల్త్కేర్, ఫైనాన్స్, పరిశోధన వంటి రంగాలలో ప్రాచుర్యం పొందిన వారికి లభిస్తుంది. దీని కోసం ప్రతి సంవత్సరం వేలాది మంది దరఖాస్తు చేసుకుంటారు. ప్రస్తుతం ఈ వీసా కోసం 85 వేల మంది పోటీ పడుతున్నారు. వీరిలో సాధారణ పరిమితి కింద 65 వేల మంది ఉండగా, అమెరికా మాస్టర్స్ డిగ్రీ, అంతకంటే ఎక్కువ ఉన్న దరఖాస్తుదారులు 20 వేల మంది ఉన్నారు.
కీలక తేదీలు ప్రకటన, ఫీజు ఎలా ఉందంటే :
ఈ వీసా దరఖాస్తుదారుల నేపథ్యంలో పిటిషనర్లు మార్చి 7 నుంచి మార్చి 22, 2025 మధ్య తమ ఉద్యోగాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్లను సమర్పించాలన్నారు. దీని కోసం ప్రతి రిజిస్ట్రేషన్ కు 215 డాలర్ల (రూ. 18,695.35) రుసుం ఉంటుందన్నారు.
లాటరీ ప్రక్రియ :
రిజిస్ట్రేషన్ల సంఖ్య వార్షిక పరిమితి కంటే ఎక్కువగా ఉంటే, తదుపరి దశ కోసం ఏ దరఖాస్తుదారులు ముందుకు వెళ్తారో నిర్ణయించడానికి USCIS యాదృచ్ఛికంగా లాటరీ ఎంపికను నిర్వహిస్తుంది. ఈ లాటరీ ఫలితాలు మార్చి 31, 2025 నాటికి ప్రకటించబడతాయి
పిటిషన్ దాఖలు చేయడం :
లాటరీలో ఎంపికైన వారు ఏప్రిల్ 1, 2025 నుంచి USCISలో H-1B అప్లికేషన్లను దాఖలు చేయవచ్చు. ఉద్యోగం H-1B స్పెషాలిటీ వృత్తి ప్రమాణాలకు అనుగుణంగా ఉందని, దరఖాస్తుదారునికి అవసరమైన అర్హతలు ఉన్నాయని నిరూపించడానికి యజమానులు అవసరమైన ధృవపత్రాలను సమర్పించాలి.
ప్రారంభ తేదీ :
ఆమోదం పొందిన H-1B వీసా హోల్డర్లు అక్టోబర్ 1, 2025 నుంచి అమెరికాలో పనిచేసే అవకాశం ఉంటుంది.
మోసాలను గుర్తించే చర్యలు :
USCIS ఒకే యజమాని చేసే బహుళ రిజిస్ట్రేషన్లను కూడా నిశితంగా పరిశీలిస్తోంది. చివరి నిమిషంలో ఇబ్బందులను తగ్గించుకోవడానికి దరఖాస్తులను మార్చి 22 గడువుకు ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
Source:https://www.andhrajyothy.com