ముత్తంగి ఎన్హెచ్–65 వద్ద మంజీర పైప్లైన్ ధ్వంసం

–15 రోజులుగా రోడ్డుపై పొంగిపొర్లుతున్న నీరు.. –కాలనీవాసుల అవస్థలు
–పట్టించుకోని సంబంధిత అధికారులు..
జ్ఞాన తెలంగాణ,పటాన్చెరు,జనవరి 20 :
పటాన్చెరు నియోజకవర్గం ముత్తంగి పరిధిలోని ఎన్హెచ్–65 విస్తరణ పనుల సందర్భంగా మంజీర నీటి పైప్లైన్ ధ్వంసమవడంతో గత 15 రోజులుగా భారీగా నీరు రోడ్డుపైకి వచ్చి పొంగిపొర్లుతోంది.ఈ సమస్యతో ముత్తంగి,చిట్కుల్ సమీప కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు మొత్తం నీటితో నిండిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటమే కాకుండా, మంచినీటిలో మురుగు నీరు కలిసే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రోజూ వృథాగా పోతున్న తాగునీటితో పాటు,రోడ్డు పూర్తిగా దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. చిన్నపిల్లలు,వృద్ధులు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది.పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే మంజీర పైప్లైన్ మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు
