కడప స్టీల్ ప్లాంట్‌పై క్రెడిట్ చోరీకి చంద్రబాబు పాల్పడ్డారు: అవినాష్ రెడ్డి

కడప: కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి తానే కృషి చేసినట్లు ప్రచారం చేసుకోవడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత అవినాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు ఈ దశకు చేరుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమే పునాదులు వేసిందని స్పష్టం చేశారు.

2019లో వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ కోసం 3,300 ఎకరాల భూమిని కేటాయించామని, అనంతరం జగన్ స్వయంగా జిందాల్ సంస్థ ప్రతినిధులతో పలుమార్లు చర్చలు జరిపి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. 2022లో జిందాల్ స్టీల్‌కు ప్రోత్సాహకాలు కల్పిస్తూ జీవో జారీ చేశామని, 2023 ఫిబ్రవరిలో సజ్జన్ జిందాల్‌తో కలిసి ప్లాంట్ శంకుస్థాపన నిర్వహించామని గుర్తు చేశారు.

పర్యావరణ అనుమతులతో పాటు ప్రాజెక్టుకు అవసరమైన కీలక అనుమతులన్నీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే సాధించామని తెలిపారు. ఎన్నికల సమయంలో భూమిపూజ చేసి ఇప్పుడు మొత్తం ఘనత తనదేనన్నట్లు ప్రచారం చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయ అవకాశవాదమేనని అవినాష్ రెడ్డి మండిపడ్డారు. జిందాల్ సంస్థ చేసిన ట్వీట్ కూడా జగన్ ప్రభుత్వ కృషినే స్పష్టంగా గుర్తించిందని ఆయన పేర్కొన్నారు.

You may also like...