అమెరికాలో 6,000 మందికి విద్యార్థి వీసాలు రద్దు..!

అమెరికాలో నిబంధనలు ఉల్లంఘించిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకొంటున్నారు. తాజాగా 6,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు అమెరికాలో నిబంధనలు ఉల్లంఘించిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకొంటున్నారు. తాజాగా 6,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాల(USA Visa)ను రద్దు చేసినట్లు బీబీసీ రిపోర్టులో పేర్కొంది. అమెరికా విదేశాంగశాఖ ఈవిషయాన్ని వెల్లడించినట్లు తెలిపింది. 4,000 మంది దేశ చట్టాలు ఉల్లంఘించడం, దాడులు, మత్తులో డ్రైవింగ్, దోపిడీలకు పాల్పడటం వంటివి చేసినట్లు తెలుస్తోంది. అమెరికా చట్టాల్లోని ఐఎన్ఏ 3బీ కింద ఉగ్రవాదానికి పాల్పడిన దాదాపు 300 మంది కూడా ఈ జాబితాలో ఉన్నారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంలో ఈ వీసాల రద్దు వ్యవహారం వెలుగులోకి రావడం గమనార్హం.
ట్రంప్ రెండోసారి అమెరికా (USA) అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక దేశంలో ఉన్నత విద్యావ్యవస్థను పునర్ వ్యవస్థీకరించే పనిలో పడ్డారు. ప్రధాన విశ్వవిద్యాలయాలను లక్ష్యంగా చేసుకొని తీవ్రస్థాయిలో పాలసీల మార్పులు చేపట్టారు. ఇవి అంతర్జాతీయ విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. తొలుత జనవరిలో యాంటీసెమిటిజమ్ను(యూదులపై వ్యతిరేకత) అరికట్టేలా బిల్లును పాస్ చేశారు. అంతర్జాతీయ విద్యార్థులు పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలు చేపడితే ఈ ఆదేశాల ప్రకారం వారిని దేశ బహిష్కరణ చేయవచ్చు.
విదేశీ విద్యార్థులకు కొత్త ఇంటర్వ్యూల షెడ్యూల్ను నిలిపివేస్తూ జూన్లో ట్రంప్ కార్యవర్గం నిర్ణయం తీసుకొంది. అనంతరం సోషల్ మీడియా వెట్టింగ్ను కఠినతరం చేశారు. ఫారెన్ స్టూడెంట్స్ కచ్చితంగా వారి సామాజిక మాధ్యమ ఖాతాలు బహిర్గతం చేయాలని ఆదేశించారు. విద్యార్థుల పోస్టులు, కామెంట్లు, లైక్లను అమెరికా అధికారులు పరిశీలించి.. వారు జాతీయ భద్రతకు ముప్పు కాదు అని భావిస్తే మాత్రమే వీసా ప్రక్రియలో ముందుకువెళతారు. ఇక కీలక విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు కేటాయించిన నిధుల్లో కోత విధించారు. క్యాంపస్ల్లో పాలస్తీనా అనుకూల ఆందోళనల్లో పాల్గొన్న చాలామంది విదేశీ విద్యార్థులను అరెస్టు చేయించారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ విద్యార్థులను నియమించుకోకుండా బ్లాక్ చేశారు. ఈక్రమంలో ట్రంప్ కార్యవర్గం, విశ్వవిద్యాలయం మధ్య న్యాయపోరాటం మొదలైంది.గతేడాది గణాంకాల ప్రకారం దాదాపు 10 లక్షల మందికి పైగా అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు. వారి నుంచి దాదాపు 43.8 బిలియన్ డాలర్లు అమెరికాకు లభించాయని ఎన్ఏఎఫ్ఎస్ఏ అసోసియేషన్ వెల్లడించింది. దేశంలోని మొత్తం విద్యార్థుల్లో వీరు 6 శాతం వరకు ఉంటారు.