చీమలదారి గ్రామ పంచాయతీలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

జ్ఞాన తెలంగాణ,మోమిన్‌పేట్ మండలం ప్రతినిధి,జనవరి 26 :
మోమిన్‌పేట్ మండలం చీమలదారి గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఎల్ల కొండ కల్పన హరీష్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. జాతీయ గీతం ఆలపించిన అనంతరం గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతపై సందేశాలు ఇచ్చారు.
వేడుకల్లో భాగంగా గ్రామంలోని విద్యార్థులు పాఠశాల నుంచి డప్పు వాయిద్యాలతో వీధివీధి తిరుగుతూ త్రివర్ణ పతాకాలతో మహనీయుల గురించి నినాదాలు చేశారు. ఈ ర్యాలీ గ్రామ ప్రజల్లో దేశభక్తి భావాన్ని మరింత బలపరిచింది. విద్యార్థుల ఉత్సాహం, క్రమశిక్షణ అందరినీ ఆకట్టుకుంది.
జెండా ఆవిష్కరణ అనంతరం జిల్లా పరిషత్ పాఠశాలలో సభ నిర్వహించారు. ఈ సభకు సర్పంచ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అందించిన హక్కులు, రాజ్యాంగ విలువలు, జాతీయ ఐక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ప్రజలందరి సహకారం ఉన్నప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాంచందర్, గ్రామ కార్యదర్శి భరత్, జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. దేశభక్తి, ఐక్యత సందేశంతో చీమలదారి గ్రామంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా, విజయవంతంగా ముగిశాయి.

You may also like...

Translate »