ఘన పూర్ జడ్పిహెచ్ఎస్ లో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షా

ఘన పూర్ జడ్పిహెచ్ఎస్ లో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
జ్ఞాన తెలంగాణ భూపాలపల్లి ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ద్వారా జరుగుతున్న పరీక్షను గన్ పూర్ జడ్పి హెచ్ఎస్ పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్ అనుమతి లేకపోవడంతో కలెక్టర్ సెల్ ఫోన్ ను తన వాహనంలో ఉంచి కేంద్రంలోకి వెళ్లారు.
గ్రూప్-1 పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన పరీక్ష నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. అభ్యర్థులు, సిబ్బంది హాజరు గురించి ముఖ్య పర్యవేక్షకులను అడిగి తెలుసుకున్నారు. బయో-మెట్రిక్ హాజరు సేకరణ కోసం ప్రత్యేకంగా నియమించబడిన ఇన్విజిలేటర్లను బయో-మెట్రిక్ సేకరణలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి, ప్రాథమిక చికిత్స వసతులతో కూడిన ఏ.ఎన్.ఎం బృందాలు అందుబాటులో ఉన్నారా లేదా అని గమనించారు.
అభ్యర్థుల హాల్ టికెట్లను ఆధార్ కార్డుతో సరిచూసిన తదుపరి అభ్యర్థులను మెయిన్ గేట్ వద్ద ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రంలోనికి అనుమతించడం జరిగిందని ఆయన తెలిపారు. పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు అనుమతి లేనందున అభ్యర్థులను మెటల్ డిటెక్టర్లలతో క్షుణ్ణంగా తనిఖీ చేశామన్నారు. కలెక్టర్ ఆయా పరీక్షా కేంద్రంలోని గదులను సందర్శిస్తూ, అభ్యర్థులకు ఏర్పాటు చేసిన సదుపాయాలను గమనించి ముఖ్య పర్యవేక్షకులకు పలు సూచనలు చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్దేశించిన నిబంధనలను తు.చ తప్పక పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో సాఫీగా పరీక్ష జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేశామని అన్నారు.
పరీక్ష సమయం ముగిసేంత వరకు అభ్యర్థులు బయటకు వెళ్లకుండా చూడాలన్నారు. కాగా, జిల్లాలో 74.47 శాతం జరిగినట్లు తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 17 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 4473 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 3331 మంది హాజరయ్యారని, 1142 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ నుండి కట్టుదిట్టమైన పోలీసు భద్రత నడుమ ఆయా రూట్లు వారీగా ప్రశ్న పత్రాలు, ఇతర సామాగ్రిని పరీక్షా కేంద్రాలకు సకాలంలో తరలించామని, ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష కొనసాగగా, పరీక్ష ముగిసిన అనంతరం అభ్యర్థుల ఓ.ఎం.ఆర్ షీట్లు, ఇతర మెటీరియల్ ను నిబంధనలకు అనుగుణంగా సీల్ వేసి, పోలీస్ భద్రత, పటిష్ఠ ఎస్కార్ట్ తో తిరిగి స్ట్రాంగ్ రూమ్ కు తరలించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం పరీక్ష నిర్వహణకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో, సజావుగా ప్రిలిమ్స్ పరీక్ష ముగిసినట్లు ఆయన తెలిపారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ, జిరాక్స్ సెంటర్లను మూసివేయించామని ఆయన పేర్కొన్నారు.