13 రాష్ట్రాల్లో 88 స్థానాలకు పోలింగ్..

Lok Sabha Election 2024 Phase 2 Voting : 13 రాష్ట్రాల్లో 88 స్థానాలకు పోలింగ్..
రెండో దశ ఓటింగ్ ఇవాళ అంటే ఏప్రిల్ 26న జరుగుతోంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ దశలో, ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో సహా 13 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది.
రెండో దశ పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. “గత రెండు సంవత్సరాలుగా సన్నాహాలు చేస్తున్నాం, అన్ని బూత్లలో ఏర్పాట్లు ఉన్నాయి, ఓటర్లకు తాగునీరు, ఫ్యాన్లతో సహా అన్ని ఏర్పాట్లు చేశాం. ఓటర్లు తమ ఇంటి నుండి బయటకు రావాలని ప్రోత్సహిస్తున్నాం. ఇళ్లు, విడిచి ఓటు వేయండి.” ఎక్కడి హింసకు చోటు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాజీవ్ కుమార్ తెలిపారు.
88 స్థానాలకు బరిలో 1202 మంది అభ్యర్థులు
రెండో దశ లోక్సభ ఎన్నికల్లో 88 స్థానాలకు గానూ 1202 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 102 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1098, ట్రాన్సజెండర్కు చెందిన ఇద్దరు పోటీ పడుతున్నారు. కాగా, 85 ఏళ్లు పైబడిన ఓటర్లు 14.78 లక్షల మంది ఉన్నారు. ఈ దశలో 15.88 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 8.08 కోట్ల మంది పురుషులు కాగా, 7.80 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. రెండో దశలో 1.67 లక్షల పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది.
రెండవ దశ పోలింగ్ ప్రారంభం..
13 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. రెండో దశలో 89 స్థానాలకు పోలింగ్ జరిగాల్సి ఉంది. అయితే మధ్యప్రదేశ్లోని బేతుల్ నుంచి బరిలోకి దిగిన బీఎస్పీ అభ్యర్థి అశోక్ భలవి మరణంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. దీంతో రెండో దశ 88 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
నేటి పోలింగ్ హైలైట్స్ ఇవే!
13 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 స్థానాలకు ఓటింగ్.
రెండో దశలో 15 కోట్ల 88 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
రెండో దశలో కేరళలో గరిష్టంగా 20 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది.
రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్ స్థానంలో ఇవాళే ఓటింగ్.
ఇవాళ తేలనున్న మోదీ ప్రభుత్వంలోని 6 మంది మంత్రులతో సహా ఇద్దరు మాజీ సీఎంల భవితవ్యం.
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పోటీ చేస్తున్న కోటా నియోజకవర్గంలోనూ ఈరోజు ఓటింగ్ జరగనుంది.
హేమామాలిని, శశిథరూర్, పప్పు యాదవ్ వంటి వారు ఈ దశలో పోటీలో ఉన్నారు.
కాంగ్రెస్కు చెందిన వెంకటరమణ గౌడ మండ్య నుంచి అత్యంత ధనవంతుడు.
నేటితో 4 రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ముగియనుంది.
మొదటి 2 దశలను కలుపుకుని 14 రాష్ట్రాలు పలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటింగ్ పూర్తవుతుంది.