దక్షిణ కొరియాలో స్మార్ట్ హెల్త్‌కేర్ ఫుట్‌వేర్ టెక్నాలజీని పరిశీలించిన లోకేష్

  • బుసాన్‌లోని షూఆల్స్ ఫ్యాక్టరీ సందర్శన
  • ఆధునిక వైద్య సాంకేతికతతో రూపొందుతున్న ఫుట్‌వేర్‌పై ఆసక్తి
  • మెడికల్ మాగ్నెటిక్, వైబ్రేషన్ చిప్‌ల పనితీరుపై అవగాహన
  • ఆరోగ్య సంరక్షణలో వినూత్న సాంకేతికతకు ప్రాధాన్యం
  • అత్యాధునిక తయారీ విధానాలను పరిశీలించిన మంత్రి


జ్ఞాన తెలంగాణ: దక్షిణ కొరియాలో అధికారిక పర్యటన కొనసాగిస్తున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బుసాన్ నగరంలోని అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన మెడికల్ డివైస్ సర్టిఫైడ్ స్మార్ట్ హెల్త్‌కేర్ ఫుట్‌వేర్ తయారీ సంస్థ షూఆల్స్ (Shoealls) ఫ్యాక్టరీని సందర్శించారు. ఆరోగ్య సంరక్షణను ఆధునిక సాంకేతికతతో మిళితం చేస్తూ తయారవుతున్న ప్రత్యేక పాదరక్షల తయారీ ప్రక్రియను మంత్రి ఆసక్తిగా పరిశీలించారు. మానవ శరీరంలో రక్త ప్రసరణను ఉత్తేజపరచడం, కండరాల అలసటను తగ్గించడం, నడకలో కలిగే అసౌకర్యాన్ని నివారించడం వంటి లక్ష్యాలతో రూపొందించిన మెడికల్ మాగ్నెటిక్ జనరేటర్లు, అత్యాధునిక ఎలక్ట్రానిక్ చిప్‌ల సాంకేతికతపై సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. పాదాల ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు ప్రత్యేకంగా రూపొందించిన మెడిచియో వైబ్రేషన్ చిప్‌లు ఎలా పనిచేస్తాయో ప్రత్యక్షంగా చూపించారు. నడక సమయంలో పాదాలపై పడే ఒత్తిడిని సమతుల్యం చేయడం, రక్తప్రసరణను మెరుగుపరచడం, కండరాలపై భారం తగ్గించడం వంటి అంశాల్లో ఈ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని సంస్థ నిపుణులు వివరించారు. ఉత్పత్తి నాణ్యత ప్రమాణాలు, పరిశోధన ఆధారిత తయారీ విధానం, నూతన ఆవిష్కరణలపై సంస్థ అనుసరిస్తున్న విధానాలను మంత్రి లోకేష్ పరిశీలించారు. ప్రపంచ ఆరోగ్య రంగంలో స్మార్ట్ హెల్త్‌కేర్ ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఇటువంటి ఆధునిక సాంకేతికతలను అధ్యయనం చేయడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. సాంకేతికత ఆధారిత తయారీ రంగంలో అంతర్జాతీయ సంస్థల అనుభవాలను అధ్యయనం చేయడం ద్వారా భారతదేశంలోనూ వినూత్న పారిశ్రామిక అవకాశాలు, పరిశోధన, పెట్టుబడులు, ఉపాధి విస్తరణకు మార్గం సుగమమవుతుందని మంత్రి పేర్కొన్నారు.

You may also like...