మాజీ ఎన్నికల కమిషనర్‌కు ఎస్‌ఐఆర్ ఫారాలు అందజేత

  • ప్రగతి రిసార్ట్స్‌లో మర్యాదపూర్వకంగా అందించిన తహశీల్దార్
  • ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై వివరాల వెల్లడి
  • మండలవ్యాప్తంగా చురుగ్గా కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమం
  • ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రక్రియ అమలు
  • కార్యక్రమంలో పాల్గొన్న బీఎల్‌వోలు

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: భారత ఎన్నికల వ్యవస్థలో విశిష్ట సేవలు అందించిన మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ లింగ్డోకు శంకర్‌పల్లి మండల పరిధిలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమానికి సంబంధించిన దరఖాస్తు ఫారాలను బుధవారం శంకర్‌పల్లి మండల తహశీల్దార్ సురేందర్ మర్యాదపూర్వకంగా అందజేశారు. మండలంలోని ప్రొద్దుటూరులో ఉన్న ప్రగతి రిసార్ట్స్‌లోని ఆయన నివాసంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ సురేందర్ మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం నిర్దేశించిన కార్యాచరణకు అనుగుణంగా శంకర్‌పల్లి మండలంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరు వివరాలు కచ్చితత్వంతో నమోదయ్యేలా అధికారులు, బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి దరఖాస్తులను పంపిణీ చేయడంతో పాటు అవసరమైన సవరణలు, చేర్పులు, తొలగింపులను నిబంధనలకు అనుగుణంగా స్వీకరిస్తున్నట్లు వివరించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, విశ్వసనీయత, ఖచ్చితత్వం మరింత బలోపేతం కావాలనే లక్ష్యంతో ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం, ఎన్నికల యంత్రాంగం అత్యంత ప్రాధాన్యంతో అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి అర్హులైన పౌరుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన ఓటరు వివరాలను ధ్రువీకరించుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల పౌరబాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి అపోహలకు తావులేకుండా ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) పాల్గొని ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను సమన్వయం చేశారు.

You may also like...