నగరంలో బయట ఆహారం తినడమే భయంకరమైన పరిస్థితిగా మారుతోంది. ఎంత పెద్ద పేరు గాంచిన హోటల్, రెస్టారెంట్ అయినా లోపల పరిస్థితులు, ఆహార నాణ్యత మాత్రం దారుణంగా ఉన్నట్లు తేలిపోతోంది. తాజాగా సాయంత్రం పూట సరదాగా కర్రీ పఫ్ తిందామనుకున్న ఓ మహిళకు వాంతికి వచ్చినంత పనైంది. కర్రీ పఫ్లో నాన్ వెజ్.. అది కూడా పాము పిల్ల రావడం చూసి షాక్కు గురయ్యింది సదరు మహిళ. ఆ వివరాలు..ఈ దారుణమైన సంఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల టౌన్లో వెలుగు చూసింది. ఓ మహిళ బేకరీకి వెళ్లి కర్రీపఫ్ తీసుకుని తింటుండగా, సడెన్గా అందులో పాము పిల్ల ప్రత్యక్షమైంది. దీంతో ఆమెకు ఒక్కసారిగా గుండాగినంత పనైంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జడ్చర్ల టౌన్ కు చెందిన శ్రీశైలమ్మ అనే మహిళ మంగళవారం సాయంత్రం స్థానికంగా కొత్త బస్టాండ్ సమీపంలోని పోలీస్ స్టేషన్కు ఎదురుగా ఉన్న అయ్యంగార్ బేకరీకి వెళ్లింది. ఒక కర్రీపఫ్ ఆర్డర్ చేసింది. దాన్ని పార్శిల్ తీసుకుని ఇంటికి వెళ్లింది.
ఇంటికి చేరుకున్న తర్వాత శ్రీశైలమ్మ తాను పార్శిల్ తెచ్చుకున్న కర్రీపఫ్ను ఒపెన్ చేసి తింటుండగా, దానిలో అనుమానాస్పదంగా ఏదో కనిపించింది. డౌట్ వచ్చి, కర్రీపఫ్ పూర్తిగా తెరిచి చూడగా, పాము పిల్ల కనిపించడంతో ఆమె షాక్కు గురయ్యింది. దీని గురించి చుట్టుపక్కల వారికి చెప్పి, వారిని తీసుకుని బేకరీకి వెళ్లింది. కర్రీపఫ్లో పాముపిల్ల రావడం గురించి బేకరీ యజమానిని ప్రశ్నించింది. అతడు సరైన సమాధానం చెప్పలేదు. పైగా వెంటనే షాపు మూసివేసి అక్కడ నుంచి జారుకున్నాడు.దీంతో బాధితురాలు పోలీసు స్టేషన్కు వెళ్లి జరిగిన దారుణం గురించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీని గురించి దర్యాప్తు చేస్తున్నారు. దీని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది తెగ వైరల్ అవుతోంది. కర్రీ పఫ్ బదులు ఎగ్ పఫ్ ఆర్డర్ చేసుంటే ఇలా జరిగి ఉండేది కాదు, వెజ్ ఆర్డర్ చేస్తే నాన్ వెజ్ వచ్చింది.. ఇంకేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.