కొమురం భీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆర్ ఎస్ పి

కొమురం భీమ్ స్ఫూర్తితో రాజ్యాధికారం సాధించాలి: డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి
ఏజెన్సీ ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ కంపెనీలు
ఆసిఫాబాద్,కొత్తగూడెం జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు జరుపాలి
‘జల్ జంగిల్ జమీన్ హమారా’ అంటూ తుపాకీ చేతపట్టి నిజాం సైన్యంతో పోరాటం చేసి అశువులు బాసిన ఆదివాసీ యోధుడు కొమురం భీమ్ స్ఫూర్తితో రాజ్యాధికారాన్ని సాధించాకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. చింతలమానేపల్లి మండలం అంబగట్టలో ఆదివాసీ సంఘాలతో కలిసి పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన కొమురం భీమ్ విగ్రహాన్ని శనివారం అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీలు నివసించే ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదాని,అంబానీలు అక్రమంగా మైనింగ్ కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు.కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలకు స్థిరనివాసం కూడా లేని దుస్థితిలో బతుకుతున్నారని ఆవేదన చెందారు.తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు పోడు పట్టాలు ఇవ్వడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు.

కొమురం భీమ్ పోరాడి సాధించిన హక్కులను,చట్టాలను ఆధిపత్య పాలకులు తుంగలో తొక్కి అన్యాయం చేస్తున్నారని,పేసా చట్టం, 1/70, జీఓ నంబర్ 3 లాంటి హక్కులను, చట్టాలను ఆదివాసీలకు చెందకుండా పాలకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఆదివాసీ గొంతుకలపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగంలో 5వ షెడ్యూల్డ్ ఏరియాలో ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడేందుకు బీఎస్పీ నిరంతరం పోరాడుతుందని అన్నారు. ఆదివాసీలకు 100 శాతం ఉద్యోగాలు కల్పించే జీవో 3 ను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.ఆదివాసీలకు జరిగే అన్యాయాలపై ఆధిపత్య పాలకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని విమర్శించారు.కొమరం భీమ్ పోరాట స్ఫూర్తితో ఆదివాసీలు రాజ్యాధికారం దిశగా పయనించాలన్నారు. పులిని చంపారనే అనుమానంతో పశువుల కాపరులైన ఆదివాసీలను నిర్బంధించి ఫారెస్ట్ అధికారులు చిత్రహింసలకు గురిచేసే జైలు పాలుచేశారని అన్నారు. పసి పిల్లలను కూడా పోలీసులు నిర్బంధించడం విచారకరమన్నారు.
ఆసిఫాబాద్,కొత్తగూడెం జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు జరుపాలి
ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఎస్టీలను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం తక్షణమే ఎన్నికలు జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంచాయితీ రాజ్ చట్టం ప్రకారం ఏజెన్సీ ఏరియాలో ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డ జిల్లా పరిషత్ చైర్మన్ల స్థానాల్లో జనరల్ కేటగిరీకి చెందిన జెడ్పీ వైస్ చైర్మన్ లను తాత్కాలిక చైర్మన్లుగా ప్రభుత్వం నియమించడం ఎస్టీ రాజకీయ హక్కులను కలరాయడమే అన్నారు. ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తే ఎంతటి పోరాటానికైనా బీఎస్పీ సిద్ధమని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సిడెం గణపతి, జిల్లా అధ్యక్షులు లెండుగురే శ్యామ్ రావు,నాయకులు సోయం చిన్నన్న, సిడేం జ్యోతి, జాడి శ్యామ్ రావు, రాజ్ కుమార్,దుర్గం వెంకటేష్, లాంచు,నాగపూరే బండు,నీలా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.