మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెల్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

నేడు ప్రధాని నరేంద్రమోదీ 75వ జన్మదినోత్స వాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సందర్భంగా మోదీకి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొన్ని రాజకీయాలకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి నెలకొల్పడానికి తాను చేస్తున్న ప్రయత్నాలకు ప్రధాని మోదీ మద్దతు తెలిపారని ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. యుద్ధం ముగియడానికి పూర్తి మద్దతు ఇస్తానని మోదీ హామీ ఇచ్చారని ట్రంప్ తెలిపారు.
డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్” ఖాతాలో ట్రంప్ ఈ విషయం వెల్లడించారు. ‘నా మిత్రుడు, ప్రధాన నరేంద్ర మోదీతో అద్భుతమైన ఫోన్ కాల్ సంభాషణ జరిగింది. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినందుకు చాలా సంతోషంగా ఉంది. మోదీ బాగా పని చేస్తున్నారని ట్రంప్ప్ర శంసించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో మీ మద్దతుకు ధన్యవాదాలు!’ అని ట్రంప్ పోస్ట్ చేశారు.
ట్రంప్ ఫోన్ చేసి, తనకు బర్త్ డే విషెస్ చెప్పినట్లు మోదీ కూడా ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ కూడా ఈ ఫోన్ కాల్పై స్పందిస్తూ, ట్రంప్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు, నా మిత్రమా అని మోదీ పేర్కొన్నారు. మీలాగే, నేను కూడా భారత్-అమెరికా సమగ్ర, ప్రపంచవ్యాప్త భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత శిఖరాలను తీసుకెళ్లడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను. ఉక్రెయిన్ సంఘర్షణకు శాంతియుత పరిష్కారం దిశగా మీ ప్రయత్నాలకు మేము మద్దతు ఇస్తున్నాం’ అని ఎక్స్ లో పోస్ట్ చేశారు మోదీ.
ఇరుదేశాల మధ్య గతకొన్ని రోజులుగా టారీఫ్ విషయంలో విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ కాల్, ఇటీవల ఇరు దేశాలమధ్య జరిగిన వాణిజ్య చర్చలు సానుకూలంగా ముగిసిన నేపథ్యంలో ప్రాముఖ్యత సంతరించుకుంది. గతంలో అమెరికా విధించిన సుంకాలు, రష్యా నుంచి చమురు దిగుమతులపై ఆంక్షల నేపథ్యంలో ఇరు దేశాలమధ్య కొంతకాలంగా నెలకొన్ని ఉద్రిక్తతలను ఈ పరిణామం తగ్గిస్తుందని భావిస్తున్నారు. ఇరుదేశాల నాయకుల మధ్య ఈ విధమైన సంభాషణలు, ద్వైపాక్షిక సంబంధాలలో మరింత బలమైన బంధానికి సూచికగా నిలుస్తున్నాయి. ఏదేఏమైనా ఇటీవల మోదీ చైనా పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లతో సమావేశమైన సందర్భంగా
ట్రంప్ వీరి సమావేశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాకు వ్యతిరేకంగా కుట్రలో భాగమే ఈ సమావేశమని అన్నారు. రష్యా చమురు విషయంలో భారత్-అమెరికాల మధ్య కాస్త ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ట్రంప్ మోదీకి ఫోన్ చేసి, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫోన్ సంభాషణలు జరగడంతో మళ్లీ రెండుదేశాల మధ్య పూర్వస్నేహసంబంధాలు కొనసాగవచ్చేనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి.