భారత్లో పెట్టుబడులు పెట్టండి : జైశంకర్

రష్యా కంపెనీలకు జైశంకర్ ఆహ్వానం
భారత్లో పెట్టుబడులు పెట్టాలని రష్యా కంపెనీలకు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఆహ్వానం పలికారు. తద్వారా వ్యాపారాన్ని మరింత విస్తృత పరుచుకోవాలన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపేయాలని.. లేదంటే అధిక పన్నులు విధిస్తామని భారత్పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు దిగుతున్న నేపథ్యంలో జయశంకర్ రష్యా పర్యటన కొనసాగుతోంది.రష్యాలో పర్యటిస్తున్న జైశంకర్.. రష్యా ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెనిస్ మంటురోవ్తో భేటీ అయ్యారు. వాణిజ్యం, ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక అంశాలపై చర్చలు జరిపారు. భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు రష్యా, భారత్లు కొత్త మార్గాలు అన్వేషించాలని ఈ సందర్భంగా జయశంకర్ పిలుపునిచ్చారు. ఇరుదేశాలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవడంతోపాటు వివిధ అంశాల్లో సహకరించుకోవాలని జైశంకర్ అన్నారు.భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థికవ్యవస్థ అని చెప్పిన జయశంకర్.. మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలతో విదేశీ వాణిజ్యానికి భారత్ కొత్త ద్వారాలు తెరిచిందన్నారు. భారత్లో రష్యా కంపెనీల వ్యాపార విస్తరణకు ఇది మరింత దోహదం చేస్తుందన్నారు. కాగా, ఈ ఏడాది చివరన భారత్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటించనున్నారు.



