వట్టే జానయ్య యాదవ్ కు అండగా రాష్ట్ర బీసీ మహిళ విభాగం

ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీఎంహెచ్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ కుటుంబానికి రాష్ట్ర బీసీ మహిళా విభాగం అండగా నిలుస్తుందని బీసీ సంఘం రాష్ట్ర కన్వీనర్ దీపిక బిల్లా, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ జ్యోతి యాదవ్, బీసీ మహిళా సంఘం వైస్ ప్రెసిడెంట్ మంజుల గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని గాంధీ నగర్ లో వట్టేజానయ్య యాదవ్ కుటుంబాన్ని పరామర్శించి ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 9 సంవత్సరాల కాలంలో పెట్టని కేసులు, బహుజన వాదం ఎత్తుకోగానే రాత్రికి రాత్రి 71 పైగా కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. తక్షణమే వట్టే జానయ్య యాదవ్ పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.వట్టేజానయ్య ఆచూకీ మంత్రి జగదీష్ రెడ్డికి తెలుసని, అతను ఎక్కడున్నా కుటుంబానికి అప్పగించి, ఆ కుటుంబంలో సంతోషం నింపాలని ఆకాంక్షించారు. కేసులు ఎత్తివేయని పక్షంలో బీసీ మహిళా సంఘం జానయ్య యాదవ్ కు అండగా ఉండి కేసులు ఎత్తివేసే అంతవరకు నిరంతరం పోరాడుతామని హెచ్చరించారు.గత ఎన్నికల్లో మంత్రి జగదీష్ రెడ్డి గెలుపు కోసం కృషి చేసిన జానయ్య యాదవును కక్ష సాధింపు ధోరణతో అక్రమ కేసులు పెట్టడం సముచితం కాదని తెలిపారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య సూచన మేరకు జానయ్య కుటుంబానికి మద్దతు తెలిపేందుకు వచ్చామని, బహుజనులకు ఎక్కడ అన్యాయం జరిగిన అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంఘం మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్ మంజుల గౌడ్, శిరీష, మహిళా విభాగం నాయకురాలు శైలజ మహేశ్వరి, మహేశ్వరి, అనిత, విజయ, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.