ఆసియా కప్కి భారత జట్టు ప్రకటన..

ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా, శుభ్మన్ గిల్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేశారు. యూఏఈ వేదికగా జరిగే ఈ టోర్నీలో భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతుంది. గ్రూప్ ఏలో భారత్తో పాటు పాకిస్థాన్, యూఏఈ, ఒమన్ జట్లు ఉన్నాయి.ఆసియాకప్ 2025 కోసం టీమిండియా జట్టును ప్రకటించారు. టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ టీ20 జట్టులోకి వచ్చాడు. అది కూడా వైస్కెప్టెన్గా. ఇటీవల ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో రాణించిన అతడికి.. టీ20 జట్టు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పజెప్పారు. శ్రేయస్ అయ్యర్కు మాత్రం నిరాశే ఎదురైంది. అతడిని జట్టులోకి తీసుకోలేదు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో మొత్తం 15 సభ్యులను బీసీసీఐ ప్రకటించింది.
ఆసియాకప్ కోసం భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.ఇదిలా ఉండగా.. శ్రేయస్ అయ్యర్ను జట్టులోకి తీసుకోకపోవడంపై క్రికెట్ ప్రియులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్లో వరుసగా రెండుసార్లు (2024, 2025) జట్టును ఫైనల్కు తీసుకెళ్లిన కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. 2024లో తన సారథ్యంతో కోల్కతా నైట్ రైడర్స్కు ఐపీఎల్ కప్పు అందించాడు. 2025లో తన జట్టును రన్నరప్ (పంజాబ్ కింగ్స్)గా నిలిపాడు. 2023 వన్డే ప్రపంచకప్లోనూ మంచి ప్రతిభ కనబర్చాడు. అలాంటి శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేయకపోవడంపై చర్చ జరుగుతోంది.యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు ఆసియాకప్ 2025 జరగనుంది. ఈ టోర్నీలో భారత్ సహా మొత్తం ఎనిమిది దేశాలు పాల్గొననున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టీమిండియా బరిలోకి దిగనుంది. ఫైనల్తో కలిపి మొత్తం 19 మ్యాచ్లు టీ20 ఫార్మాట్లో జరుగుతాయి.8 టీమ్లను రెండు గ్రూప్లుగా విభజించారు. ఇందులో గ్రూప్ ఏలో భారత్, పాకిస్థాన్, యూఏఈ, ఒమన్ ఉన్నాయి. గ్రూప్ బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, హాంకాంగ్ జట్లు ఉన్నాయి. తొలుత గ్రూప్ స్టేజ్, ఆపై సూపర్-4 మ్యాచ్లు జరుగుతాయి. సూపర్-4లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య సెప్టెంబర్ 28న ఫైనల్ జరుగుతుంది.
