సంచలనంగా మారిన యాచారం దంపతుల మరణం

  • హత్యా? ఆత్మహత్యా? కోణంలో దర్యాప్తు ముమ్మరం

జ్ఞానతెలంగాణ,వికారాబాద్:
వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామంలో దంపతుల మృతి ఘటన సంచలనంగా మారింది. నక్కల థశరత్, నక్కల లక్ష్మీ దంపతులు ఒకే సమయంలో మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా, పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
గ్రామస్తుల సమాచారం మేరకు, ఆదివారం రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇంట్లోనే ఇద్దరూ మృతి చెందినట్లు గుర్తించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒక్కసారిగా దంపతులు ఇద్దరూ మృతి చెందడం పలు అనుమానాలకు దారితీసింది.
ఈ ఘటన హత్యా లేక ఆత్మహత్యా అన్న కోణంలో బంట్వారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దారూర్ సీఐ ఈ కేసును సీరియస్‌గా తీసుకుని, సంఘటన స్థలాన్ని పరిశీలించి, ఆధారాలు సేకరిస్తున్నారు. మర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో దంపతుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి చేశారు.
పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా దంపతుల మృతికి గల అసలు కారణాలు వెలుగులోకి రానున్నాయని పోలీసులు తెలిపారు. గ్రామస్తులు మాత్రం థశరత్, లక్ష్మీ ఆత్మహత్య చేసుకునేంత బలహీనులు కాదని స్పష్టం చేస్తున్నారు. వారి కుటుంబ జీవితం సాధారణంగానే సాగుతోందని, ఎలాంటి తీవ్ర విభేదాలు తమకు తెలియవని స్థానికులు చెబుతున్నారు.
దంపతులు ఒకేసారి మృతి చెందడం వెనుక అసలు కారణాలు ఏమిటనే అంశంపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌తో పాటు సాంకేతిక ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా నిజానిజాలు త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై గ్రామంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

You may also like...

Translate »