ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రచారం సరియైనది కాదు

కె.చంద్రశేఖర్,మోజర్ల సర్పంచ్
జ్ఞాన తెలంగాణ,పెద్దమందడి మండల ప్రతినిధి,డిసెంబర్ 26:
ఎన్నికైన వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాకుండా ప్రజాస్వామ్యాన్నీ అవమానించారని మోజర్ల గ్రామ సర్పంచ్ కె. చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం పెద్దమందడి మండలంలోని మోజర్ల గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ నెల 22 నిర్వహించనప్పటికీ ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎన్నికైన వార్డు సభ్యులందరికీ ఆహ్వానాలు జారీ చేయడం జరిగిందన్నారు. అయితే కొందరు వార్డు సభ్యులు,ఉపసర్పంచ్ అనివార్యకారణాల వల్ల కార్యక్రమానికి హాజరు కాలేకపోయినప్పటికీ, తర్వాత లిఖిత పూర్వకంగా గానీ, మౌఖికంగా గ్రామ సర్పంచ్ కు లేదా పంచాయతీ కార్యదర్శికి ఎటువంటి సమాచారం ఇవ్వలేదనీ స్పష్టం చేశారు.అయినప్పటికీ కొందరు సభ్యులు కావాలనే పంచాయతీ కార్యదర్శినీ తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేయడం దురదృష్టకారమన్నారు. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమైనదిగా, నిరాధారణమైనదనీ ఖండించారు. ఎన్నికైన సభ్యులు అధికారికంగా సమాచారం అందిస్తే, నిబంధనల ప్రకారం ఎజెండా ఆధారంగా ఎప్పుడైనా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పంచాయతీ సిద్ధంగా ఉందని గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. గ్రామ ప్రజలు ఈ విషయాన్ని గమనించి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు. అలాగే మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ కొత్త కాపు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ…..ప్రజలు ఓటు వేసి ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా సత్ప్రవర్తనతో వ్యహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రమాణ స్వీకారోత్సవం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో అత్యంత కీలకమైన అంశమని,దాన్ని హాజరుకాకుండా రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు.గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టీ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్ తో పాటు గ్రామ వార్డు సభ్యులు , గ్రామ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
