బాలికపై సామూహిక లైంగిక దాడి

జ్ఞానతెలంగాణ,ఖమ్మం ప్రతినిధి,నవంబర్ 02:
ఖమ్మం జిల్లాలో అత్యంత దారుణ ఘటన వెలుగుచూసింది. ఒంటరిగా వెళ్తున్న ఓ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితుల్లో ఇద్దరు 16 ఏళ్ల బాలురు కాగా, మరొకరు 18 ఏళ్ల యువకుడు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో శుక్రవారం రాత్రి ఈ అమానుష ఘటన జరగగా, బాధితురాలి తల్లిదండ్రులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది.
పోలీసుల కథనం ప్రకారం కొణిజర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక 8వ తరగతి చదువుతోంది. శుక్రవారం ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్ వెళ్లడంతో, బాలిక తన నాయనమ్మ, తాతయ్యతో కలిసి సమీపంలోని ప్రార్థనా మందిరానికి వెళ్లింది. అక్కడి నుంచి ఇంటికి ఒంటరిగా బయలుదేరిన ఆమెను నిందితుల్లో ఒకడైన బాలుడు మార్గమధ్యలో ఆపాడు. “మీ తమ్ముడు కిందపడిపోయాడు, దెబ్బలు తగిలాయి, వెంటనే రా” అని చెప్పాడు.
అతడి మాటలు నమ్మిన బాలికను, ఆ బాలుడు తన స్నేహితుడైన 18 ఏళ్ల యువకుడి ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే మరో బాలుడు కూడా ఉన్నాడు. అనంతరం ముగ్గురూ కలిసి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్న బాలిక భయంతో ఆ రాత్రి ఎవరికీ విషయం చెప్పలేదు. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి తల్లిదండ్రులు తిరిగి వచ్చాక, వారికి జరిగిన ఘోరాన్ని వివరించడంతో వారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
వెంటనే కొణిజర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఒక యువకుడు, ఇద్దరు మైనర్లపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం నిందితులు ముగ్గురూ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
