మాజీ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణస్వీకారం

హైదరాబాద్లోని రాజ్భవన్ దర్బార్ హాలులో ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో అల్లా పేరు మీద ప్రమాణం చేయించారు. కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో నిరాడంబరంగా జరిగింది.ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఇతర కేబినెట్ సహచరులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
ప్రమాణస్వీకారం అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేబినెట్ సహచరులు అజారుద్దీన్కు శుభాకాంక్షలు తెలిపారు. సరిగ్గా మధ్యాహ్నం 12:25 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం కేవలం తొమ్మిది నిమిషాల్లోనే ముగియడం విశేషం. మరోవైపు, అజారుద్దీన్కి ఏ శాఖ కేటాయిస్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.క్రీడా రంగంలో ఘనత సాధించిన అజారుద్దీన్ ఇప్పుడు ప్రజా సేవ రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభించడంతో, ఆయనకు తెలంగాణ ప్రజల నుంచి శుభాకాంక్షల వెల్లువ వ్యక్తమవుతోంది.
