సిపిఎం నేత సామినేని రామారావు హత్య,కమిషనర్ సునీల్ దత్ పరిశీలన

- చింతకాని మండలంలో ఉద్రిక్తత
- కమిషనర్ సునీల్ దత్ పరిశీలన
- నిందితుల కోసం ప్రత్యేక బృందాలు
- సిపిఎం, ప్రజా సంఘాల ఖండన
- అదనపు పోలీసులు మోహరింపు
జ్ఞాన తెలంగాణ, ఖమ్మం జిల్లా,మధిర ప్రతినిధి,అక్టోబర్ 31:
ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గ పరిధిలో చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సిపిఎం రైతు సంఘం నేత, మాజీ సర్పంచ్ సామినేని రామారావు దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి గొంతు కోసి హతమార్చారు. ఈ ఘటనతో చింతకాని మండలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ స్వయంగా అక్కడికి వెళ్లి దర్యాప్తు పరిస్థితులను సమీక్షించారు. నేరస్తులను త్వరితగతిన పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ప్రజా నాయకుడిగా, రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేసిన రామారావు హత్యపై సిపిఎం నాయకులు, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. పాతర్లపాడులో పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అదనపు పోలీసు బలగాలను మోహరించారు.
