జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దూకుడు పెంచిన కాంగ్రెస్

హైదరాబాద్, అక్టోబర్ 29 (జ్ఞానతెలంగాణ)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి దూకుడు ప్రారంభించింది. ఎన్నికల ప్రచార గడువు నవంబర్ 9వ తేదీ వరకు కొనసాగనున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులందరికీ “నవంబర్ 9వ తేదీ వరకు హైదరాబాద్ వదిలి వెళ్లరాదు” అని సూచించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి విజయాన్ని నిర్ధారించడానికి ప్రతి మంత్రి వ్యక్తిగతంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకోవాలని ఆయన ఆదేశించారు.
అలాగే, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మంత్రులతో సమన్వయంగా పనిచేసి ప్రచారాన్ని మరింత ఉత్సాహభరితంగా నిర్వహించాలని రేవంత్ స్పష్టం చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కాంగ్రెస్ శ్రేణులు, మంత్రుల ఆధ్వర్యంలో ఓటు చైతన్య యాత్రలను, డోర్టూ-డోర్ క్యాంపెయిన్లను ప్రారంభించాయి. ప్రజల సమస్యలు, అభివృద్ధి వాగ్దానాలను ప్రతీ ఇంటికీ చేరవేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు.
రాష్ట్ర మంత్రులు, ముఖ్యంగా హైదరాబాదులోని శాఖలకు చెందిన నాయకులు ఈ ఎన్నికను పార్టీ శక్తి ప్రదర్శనగా మలచాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
