అజారుద్దీన్‌కి మంత్రి పదవి ఖాయం!

  • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం
  • అజారుద్దీన్‌కి మంత్రిపదవి — కొత్త రాజకీయ ఇన్నింగ్స్‌
  • జూబ్లీహిల్స్ ఉపఎన్నికల వ్యూహం వెనుక కాంగ్రెస్‌ మాస్టర్ ప్లాన్‌

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్‌,అక్టోబర్ 29: తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం మరోసారి వ్యూహాత్మక అడుగు వేసింది. మాజీ భారత క్రికెటర్‌, ప్రస్తుత కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మొహమ్మద్‌ అజారుద్దీన్‌‌ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. మైనారిటీ వర్గానికి సముచిత ప్రాతినిధ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.అజారుద్దీన్‌కి ఎంఎల్సీగా అవకాశం కల్పించి, అనంతరం మంత్రి పదవి ఇవ్వనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 31వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల వ్యూహం వెనుక కాంగ్రెస్‌ ప్లాన్‌:

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలు సమీపిస్తుండగా మైనారిటీ ఓట్లపై కాంగ్రెస్‌ దృష్టి సారించింది. హైదరాబాద్‌ మరియు పరిసర ప్రాంతాల్లో మైనారిటీ ఓటర్లు కీలక పాత్ర పోషించే నేపథ్యంలో పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.ఈ క్రమంలో, ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీకి MIM పరోక్ష మద్దతు లభించినట్లు సంకేతాలు వెలువడినాయి. ఈ పరిణామం మైనారిటీ వర్గంలో కాంగ్రెస్‌పై నమ్మకం పెంచుతుందనే అంచనాలు ఉన్నాయి.

అజారుద్దీన్‌కి మంత్రిపదవి ,కొత్త రాజకీయ ఇన్నింగ్స్‌ :

హైదరాబాద్‌ పాతనగరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అజారుద్దీన్‌ గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తిగా, మైనారిటీలతో పాటు యువతలో కూడా మంచి ఆదరణ కలిగిన నాయకుడు.కాంగ్రెస్‌ సర్కార్‌లో ఆయనకు చోటు దక్కడం ద్వారా రేవంత్‌ క్యాబినెట్‌కి మరింత జాతీయత, వైవిధ్యం చేరుతుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

పార్టీ వర్గాల స్పందన :

కాంగ్రెస్‌ నేతలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, “మైనారిటీ సమాజం నుండి వచ్చిన ప్రతిభావంతులైన నాయకులకు సీఎం రేవంత్‌ అవకాశం ఇవ్వడం ప్రశంసనీయం. అజారుద్దీన్‌ చేరికతో ప్రభుత్వానికి కొత్త ఊపు వస్తుంది” అని పేర్కొన్నారు.

రాజకీయ విశ్లేషణ

ఈ నిర్ణయంతో మైనారిటీ ఓటు బ్యాంకు మరోసారి కాంగ్రెస్ వైపే తిరిగే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో పార్టీకి ఇది మేలు చేకూర్చే వ్యూహాత్మక అడుగుగా పరిగణించబడుతోంది.

You may also like...

Translate »