బీహార్ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్

  • బీహార్ మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్
  • సీట్ల పంపకాలపై ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య వీడిన ప్రతిష్టంభన
  • రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ అధికారిక ప్రకటన
  • కూటమిలో ఆర్జేడీకి 143 అసెంబ్లీ స్థానాలు ఖరారు
  • డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ముఖేశ్ సహానీ పేరు ప్రకటన
  • కాంగ్రెస్ అధిష్ఠానం జోక్యంతో వివాదానికి తెర

జ్ఞానతెలంగాణ,నేషనల్ బ్యురో:
బీహార్ రాజకీయాల్లో గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రతిపక్ష ‘మహాఘటబంధన్’ (మహాకూటమి) తన ముఖ్యమంత్రి అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్ నాయకత్వంలోనే కూటమి ఎన్నికల బరిలోకి దిగనుందని స్పష్టం చేసింది.
పాట్నాలోని మౌర్య హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి భాగస్వామ్య పక్షాల నేతల సమక్షంలో ఈ కీలక ప్రకటన వెలువడింది. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, బీహార్ కాంగ్రెస్ ఎన్నికల ఇన్‌ఛార్జ్ అశోక్ గెహ్లాట్.. తేజస్వి యాదవ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తూ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ముఖేశ్ సహానీ పేరును కూడా ఆయన ఖరారు చేశారు.తేజస్వి యాదవ్ ఒక యువ నాయకుడు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి. ఆయనకు సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తు ఉంది. అందుకే, ఆయన నాయకత్వంలోనే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని మేమంతా నిర్ణయించాం” అని అశోక్ గెహ్లాట్ ఈ సందర్భంగా తెలిపారు.
సీట్ల పంపకాలు, సీఎం అభ్యర్థిత్వంపై ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. 2020 ఎన్నికల్లో కేవలం 19 సీట్లు గెలిచినప్పటికీ, ఈసారి కూడా తమకు 70 సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. అయితే, కాంగ్రెస్ గత ప్రదర్శన దృష్ట్యా అన్ని సీట్లు ఇచ్చేందుకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సుముఖత చూపలేదు. దీంతో కూటమిలో ప్రతిష్టంభన ఏర్పడింది.
పరిస్థితి చేయిదాటిపోతుండటంతో కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దిగింది. సమస్య పరిష్కార బాధ్యతను అశోక్ గెహ్లాట్‌కు అప్పగించింది. బుధవారం పాట్నాకు చేరుకున్న ఆయన.. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి, తేజస్వి యాదవ్‌లతో సమావేశమై చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలితంగానే కూటమిలోని అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని, అందరం కలిసికట్టుగా ఎన్నికల్లో పోరాడతామని గెహ్లాట్ ప్రకటించారు.తాజా ఒప్పందం ప్రకారం, ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ నిర్ణయంతో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయేను ఎదుర్కొనేందుకు మహాకూటమి ఐక్యంగా సిద్ధమైనట్టయింది. ఈ పరిణామం కూటమి ప్రచారానికి కొత్త ఊపునిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

You may also like...

Translate »