సి.ఎస్. విట్టల్ వాలీబాల్ టోర్నమెంట్లో రిపోర్టర్లకు అవమానం

సి.ఎస్. విట్టల్ వాలీబాల్ టోర్నమెంట్లో రిపోర్టర్లకు అవమానం
- ఆహ్వానించి, వెళ్లగొట్టిన నిర్వాహకులు
- “మీకు పని లేదా?” – ఈవెంట్ ఫుడ్ ఇంచార్జి దురుసు మాటలు
- అనుమతులు లేకుండానే జాతీయ స్థాయి టోర్నమెంట్… భద్రతపై ప్రశ్నలు
జ్ఞానతెలంగాణ,శంకర్పల్లి ప్రతినిధి:
శంకర్పల్లి మండలంలోని ప్రొద్దుటూరు పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న సి.ఎస్. విట్టల్ ఫామ్ హౌస్లో సి.ఎస్. విట్టల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న వాలీబాల్ టోర్నమెంట్లో స్థానిక మీడియా ప్రతినిధులు ఘోర అవమానానికి గురయ్యారు. క్రీడా కార్యక్రమానికి వార్తావిషయ కవరేజ్ ఇవ్వాలని స్వయంగా ఆహ్వానించిన నిర్వాహకులు, ఆహ్వానాన్ని మన్నించి అక్కడికి చేరుకున్న పాత్రికేయులను అవమానకరంగా ప్రవర్తించి బయటకు పంపించినట్లు సమాచారం.
ఈవెంట్ నిర్వాహకులు పాత్రికేయులతో “మీకు పని లేదా..? భోజనం చేయడానికి వస్తారా..?” అంటూ మాటల దురుసుగా మాట్లాడినట్టు అక్కడ ఉన్న సాక్షులు తెలిపారు. ఈ ఘటనపై రిపోర్టర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సమాచారం అందించే పాత్రికేయులను ఇలాగే అవమానించడం పట్ల స్థానిక ప్రజలు, క్రీడాభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇంత పెద్ద స్థాయిలో జరుగుతున్న ఈ వాలీబాల్ టోర్నమెంట్కు అవసరమైన అధికారిక అనుమతులూ లేవన్న వార్తలు వినిపిస్తున్నాయి. గ్రామపంచాయతీ అనుమతి లేకుండా, పోలీస్ పర్మిషన్ లేకుండానే వందలాది జట్లతో కార్యక్రమం నిర్వహించడం, ఒక చిన్న ఫామ్ హౌస్లో వేలాది మంది చేరడం భద్రత పరంగా తీవ్రమైన లోపమని గ్రామస్థులు పేర్కొన్నారు.
ఈ ఘటన నేపథ్యంలో పాత్రికేయుల సంఘాలు స్పందించే అవకాశం ఉందని, రిపోర్టర్లను అవమానించిన నిర్వాహకులపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేసే అవకాశముంది. ప్రజాస్వామ్యంలో మీడియా గౌరవాన్ని కాపాడాల్సిన సమయమిదని అభిప్రాయపడుతున్నారు.
