ఇంట్లో తండ్రి మృతదేహం.. మరోవైపు ఇంటర్ ఎగ్జామ్..

పేద కుటుంబం.. ఆ తండ్రి తనకొచ్చిన కష్టం తన బిడ్డకు రాకూడదని అనుకున్నాడు.. బాగా చదువుకుని మంచి జీవితాన్ని సాధించాలని ఆకాంక్షించాడు.. ఉన్నతంగా చదివించాలని కలలు కన్నాడు.. ఇలా కొడుకు టెన్త్ అయిపోయింది.. ఇంటర్ చదవుతున్నాడు.. తెల్లారితే కొడుకు ఇంటర్ పరీక్ష.. ఉన్నట్టుండి విషాదం.. గుండెపోటుతో మృతి చెందాడు.. ఇంట్లో కన్నతండ్రి మృతదేహం.. ఇటు పరీక్ష.. ఇలాంటి అగ్ని పరీక్ష మరెవరికీ రాకూడదు అంటూ కన్నీరుమున్నీరయ్యాడు. ఇలా ఆ విద్యార్ధి కష్టం హృదయ విదారకంగా మారింది. నేటి నుండి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి.. అయితే.. పరీక్షల రోజున అర్ధాంతరంగా తండ్రి గుండెపోటుతో మరణించడం.. ఆ బిడ్డను పరీక్షకు హాజరు కావాలా వద్దా అనే మీమాంసలో పడేసింది. ఈ ఘటన ఏపీలో నెల్లూరు జిల్లా సంగం మండలంలో జరిగింది..
నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని కందల శివకుమార్ ఆదివారం గుండెపోటుతో మరణించాడు. అతని కుమారుడు రామ సాయి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.. సోమవారం ఉదయం నుండి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మొదలయ్యాయి.. ఇంట్లో తండ్రి మృతదేహం ఒక వైపు మరో వైపు ఇంటర్ పరీక్షలు.. పరీక్షలకు హాజరు కావాలా? వద్దా ? ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో విద్యార్ధి రామసాయి దుఃఖ సాగరమయ్యాడు.
