జ్ఞానతెలంగాణ,హైద్రాబాద్ : దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్ విభజన 2026లో జరగాల్సి ఉంది. ఈ భారీ ప్రక్రియ తర్వాత రాష్ట్రాల్లో లోక్ సభ, అసెంబ్లీ సీట్లలో పెను మార్పులు రాబోతున్నాయి.ఇందులో అత్యధికంగా ఉత్తరాది రాష్ట్రాలు లబ్ది పొందడం ఖాయంగా తెలుస్తోంది. జనాభా ఆధారంగా జరిగే పునర్ విభజన కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు భారీ నష్టం తప్పదన్న అంచనాలు ఉన్నాయి. దీంతో ఇప్పటికే ఆ మేరకు భయాలు మొదలయ్యాయి. అయితే కేంద్రం అంచనాల ప్రకారం వివిధ రాష్ట్రాల్లో పెరిగే సీట్ల సంఖ్య ఇలా ఉంది.
భారత దేశ పటంలో పైన ఉన్న జమ్మూ కాశ్మీర్ లో ఎంపీల సంఖ్య 9కి పెరకబోతోంది. హిమాచల్ ప్రదేశ్ లో 4, పంజాబ్ లో 18, ఉత్తరాఖండ్ లో 7, హర్యానాలో 18, ఢిల్లీలో 13, యూపీలో 143, రాజస్తాన్ లో 50, గుజరాత్ లో 43, మధ్యప్రదేశ్ లో 52, జార్ఖండ్ లో 24, బీహార్ లో 79, ఛత్తీస్ ఘడ్ లో 19, పశ్చిమబెంగాల్లో 60, సిక్కింలో 1, అరుణాచల్ ప్రదేశ్ లో 2, అస్సోంలో 21, నాగాలాండ్ లో 1, మణిపూర్ లో 2, మిజోరంలో 1, త్రిపురలో 2, మేఘాలయలో 2, ఒడిశాలో 28, మహారాష్ట్రలో 70, ఏపీ, తెలంగాణలో కలిపి 54, కర్నాటకలో 41, తమిళనాడులో 49, పుదుచ్చేరిలో 1, కేరళలో 20, లక్షద్వీప్ 1, గోవా 2, అండమాన్ లో 1, దాద్రానగర్ హవేలీలో 2 కాబోతున్నాయి.
ఇలా చూస్తే మొత్తం సీట్ల సంఖ్య ప్రస్తుతం ఉన్న 543 నుంచి 848కి పెరగబోతోంది. ఇందులో ఒక్క యూపీ-బీహార్ వాటాయే 222 సీట్లు కానుంది. దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు 165, ఇతర రాష్ట్రాల్లో సీట్లు 461 కాబోతున్నాయి. దీంతో దక్షిణాదికి జరుగుతున్న అన్యాయం ఏంటో ఇట్టే అర్దమవుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణాదికి అన్యాయం జరగదంటూ కేంద్రం సన్నాయినొక్కులు నొక్కుతోంది. అయితే దీనికి విరుగుడుగా జనాభా ఆధారంగా కాకుండా ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయం ప్రాతిపదికగా ఈ విభజన చేయాలని దక్షిణాది రాష్ట్రాలు కోరుతున్నాయి. దీనిపై కేంద్రం స్పందించడం లేదు.