కాంగ్రెస్ పాలనలో గ్రామాలు ఆగమైతున్నయ్

కాంగ్రెస్ పాలనలో గ్రామాలు ఆగమైతున్నయ్


అభివృద్ధి లేకున్నా పన్నులు ఎందుకు కట్టాలని ప్రశ్న

స్థానిక ఎన్నికలు ఎప్పుడో ప్రభుత్వానికే తెలియదు

డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్బి,ఆర్ఎస్ రాష్ట్ర నాయకులు.


గత 15 నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో పాలన సాగక ఆగమైతున్నాయని,సర్పంచ్ లు లేక,నిధులు రాక అభివృద్ధి జరగక ప్రజలు అవస్థలు పడుతున్నారని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు.

ఈ రోజు కాగజ్ నగర్ మండలంలోని భట్ పల్లి గ్రామంలో పర్యటించిన ఆయన గ్రామస్థులను కలిసి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. గ్రామాల్లో గత 15 నెలలుగా సర్పంచ్ లు లేకపోవడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు రాక,కనీసం వీధి లైట్లు పెట్టే పరిస్థితి లేదన్నారు. గ్రామాల్లో మురికి కాల్వలు అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. గ్రామ పంచాయితీ ట్రాక్టర్లకు డీజిల్ పోసే దిక్కులేదన్నారు.

పారిశుధ్య కార్మికులకు కూడా సరైన సమయంలో జీతాలు రాక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి గ్రామాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు ఎపుడుంటాయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా క్లారిటీ లేదని విమర్శించారు.

ఎలాంటి వసతులు లేకపోయినా ప్రతి నెలా పన్నులు మాత్రం క్రమం తప్పకుండా వసూలు చేస్తున్నారని,గ్రామస్థులు సౌకర్యాలు కల్పించకపోతే పన్నులు ఎందుకు చెల్లించాలని నిలదీశారు.

తుంగమడుగు గ్రామస్తులను కలిసి వారి సమస్యలు తెలుసుకొన్నారు. అక్కడ అంగన్ వాడీ కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానని మాటిచ్చారు.తుంగమడుగు గ్రామానికి రోడ్డు వేయడం ఎమ్మెల్యేకు చేతకావడం లేదన్నారు. గెలిచిన ఆరు నెలల్లో రోడ్డు వేయిస్తానని చెప్పి, గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గ్రామానికి కూడా రావట్లేదన్నారు. గత ఎమ్మెల్యే కోనప్ప కొబ్బరికాయలు కొట్టి ప్రజలకు ఆశ జూపి వదిలేశారని ఎద్దేవా చేశారు.

నెల రోజుల్లో ఆ గ్రామానికి రోడ్డు వేయకుంటే వందలాది మందితో నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన రైతులకు ఎన్ని రోజుల్లో ఎకరానికి ఎంత పరిహారం చెల్లిస్తారో అసెంబ్లీ వేదికగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు రాజ్ కుమార్ యాదవ్,కాశపాక రాజు, అంజన్న,నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »