మురికివాడల్లోని చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఫతేనగర్లో ఏర్పాటుచేసిన ఉద్భవ్ పాఠశాలను సీఎస్ కె.రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ బుధవారం ప్రారంభించారు. ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థుల సంఘం, హైదరాబాద్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పేద విద్యార్థుల కోసం ఆధునిక వసతులతో ఈ పాఠశాలను ఏర్పాటు చేశారు. పాఠశాల బోర్డు ట్రస్టీలుగా ఐఐఎం పూర్వ విద్యార్థులైన మాజీ ఐపీఎస్ అధికారి ఎస్వీ రమణమూర్తి, షణ్ముఖ, హరీశ్కుమార్, సీతారాం, శ్రీహర్ష ఈ పాఠశాలను ప్రారంభించారు.
పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు నెలకొల్పిన ఈ పాఠశాల విజయవంతంగా కొనసాగాలని సీఎస్ రామకృష్ణారావు అభిలషించారు. పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ హైటెక్ పాఠశాల మరింత మంది స్వచ్ఛంద సేవకులకు ప్రేరణ కావాలని డీజీపీ జితేందర్ అన్నారు. ఉద్భవ్ పాఠశాలల్లో ప్రస్తుతం 1,086 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ఉద్భవ్ పాఠశాలల నిర్వాహకుడు మురళీధరన్ తెలిపారు