బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు భీమ్ భరత్ !

ఎల్లంపల్లిలో రాజశేఖర్ హత్యపై ఉద్రిక్తత


ఎల్లంపల్లి గ్రామంలో దళిత యువకుడు ఎర్ర రాజశేఖర్ హత్యపై తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో గ్రామమంతా ఉద్రిక్తత నెలకొంది. కుల అహంకారంలో జరిగిన ఈ దారుణ హత్యతో గ్రామ ప్రజలు భయంతో, ఆందోళనతో ఉన్నారు. ఘటన బయటపడిన వెంటనే భారీగా పోలీసులు మోహరించడంతో ఎల్లంపల్లి గ్రామం మరింత ఉద్విగ్నంగా మారింది. రాజశేఖర్ మరణం వెనుకున్న క్రూరత్వం, కుటుంబం చెప్పిన వివరాలు ప్రజలను షాక్‌కు గురిచేశాయి.

ఈ పరిస్థితుల్లో బాధిత కుటుంబానికి అండగా నిలవడానికి చెవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ భీమ్ భరత్ ఎల్లంపల్లికి రానున్నారు. బాధితులను పరామర్శించడంతో పాటు, హత్య ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరగాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసే అవకాశం ఉంది. గ్రామంలో నెలకొన్న భయభ్రాంతి పరిస్థితిని పరిశీలించడానికి భీమ్ భరత్ పర్యటన ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పడం, పోలీసుల నిర్లక్ష్యంపై ప్రశ్నించడం, కుల వివక్షతపై స్పందించడం వంటి అంశాలపై ఆయన పర్యటనలో స్పష్టమైన సందేశం వెలువడనుంది.

ఎల్లంపల్లిలో చోటుచేసుకున్న ఈ పరువు హత్య ప్రాంతీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఇప్పుడు భీమ్ భరత్ పర్యటనతో ఈ ఘటనపై రాజకీయ మరియు సామాజిక దృష్టి మరింతగా పడే అవకాశం ఉంది.

You may also like...

Translate »