కట్టు కథలు నమ్మడంలో భారతీయులే ఫస్ట్!


–డాక్టర్ దేవరాజు మహారాజు
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డువిజేత, జీవశాస్త్రవేత్త
ఈ విద్వేషానికి, విధ్వంసాలకు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మారణహోమాలకూ కారణం కేవలం అతడొక్కడే! అతడూ, అతని ముఠాలోని అనుచరులూ కారణం!! అతడిపేరుదేవుడు. అతని ముఠా పేరుమతం. అతడి అనుచరులే మతబోధకులూ, భక్తులు!! ఐదువేల ఏళ్లక్రితం కృష్ణుడు ఉండేవాడు అని పిట్ట కథలు చెప్పేవారు కాస్త చారిత్రక ఆధారాలేమిటో తెలుసుకుంటే బావుండును. పదకొండో శతాబ్దం వరకు భారతీయ పురాణాలలో ఎక్కడా కృష్ణ శబ్దమేలేదు. వాసుదేవ అనే శబ్దం జాతక కథలలో మాత్రమే ఉంది. ఇరానియన్ యాత్రికుడు అల్ బరూనీ రాసుకున్న తన యాత్రా విశేషాలలో కూడా వసుదేవ పేరు ఉందేగాని, కృష్ణ శబ్దం లేదు‘జాతక కథలు’ బౌద్ధ సాహిత్యానికి సంబంధించినవి. బైబిల్ కథలన్ని కట్టు కథలే అంటూ ఓ ఆధునిక కవి ఎన్నో ప్రశ్నలు గుప్పించాడు.
జవాబుల్లేని ప్రశ్నలు అన్ని మతాల మత గ్రంథాల్లోనూ ఉన్నాయి. భక్తులు తమ ఆదాయంలోని దశమభాగం చర్చ్కి ఇవ్వడం మానేస్తే మొట్టమొదట క్రైస్తవాన్ని వదిలేసేవాడు పాస్టరే! అలాగే అల్లా సర్వశక్తి సంపన్నడు అని చెప్పడానికి ఓ కట్టుకథ చెపుతారు. ‘‘ ఓ నా ప్రభూ! నువ్వు మృతులను ఎలా సజీవులుగా చేస్తావో చూపు’’ అన్నాడు ఇబ్రహీం. ‘‘ఏం! నీకు నమ్మకం లేదా?’’ అన్నాడు అల్లాప్ా. ‘‘ఉంది. కానీ, నా మనసు తృప్తి పడడానికి అడుగుతున్నాను’’ఇబ్రహీం. ‘‘అయితే, నాలుగు పక్షులను తీస్కో. వాటిని మచ్చిక చేసుకో. తర్వాత వాటినికోసి వాటి విడి భాగాల్ని కొండమీద పెట్టు. అవి ఎగురుకుంటూ వస్తాయి’’ అన్నాడు అల్లాప్ా. ‘‘అందువల్ల అల్లాప్ా శక్తిమంతుడు అని తెలుసుకో’’ అని కూడా చెప్పాడు అల్లాప్ా. ఇబ్రహీం మాట్లాడలేదు. వివేకవంతుడైన ఆధునికుడైతే అక్కడ మరో ప్రశ్న అడిగేవాడు.
‘చనిపోయినవే, బతికి వచ్చాయని రుజువేమిటీ? ఆ వచ్చేవి కొత్తపక్షులు కావచ్చుకదా?’ అని! తమ జాతిపక్షి చనిపోతే వెంటనే ఇతర పక్షులు అక్కడికే అరుచుకుంటూ వస్తాయి. ఉదాహరణకు మీరు ఒక పామును కొట్టి చంపండి. దాని జీవద్రవాలు ఉత్ప్రేరకాలుగా పనిచేసి, కాసేపటికి ఆ చోటికి మరో పాము వస్తుంది. ఇది జంతు ప్రవృత్తిలో ఒక భాగం. ఎవరి శక్తియుక్తులూ అక్కరలేదు. అన్ని మత గ్రంధాలలో అభూత కల్పనలు కోకొల్లలు. అవన్నీ నిజమే అని ఇంకా ఈ ఆధునిక కాలంలో కూడా గుడ్డిగా నమ్ముతున్నవారి సంఖ్యే అధికం. ఇతర దేశాలవారి కన్నా కట్టు కథలు నమ్మడంలో భారతీయులదే మొదటి స్థానం. ఉదాహరణకు… హిందూ మతగ్రంధాల్లోని కుమారస్వామి జననం గూర్చి చూద్దాం! అక్కడ ఒక సన్నివేశం ఏమిటంటేఅగ్నిదేవుడు శివుణ్ణి చూడడానికి వచ్చాడు. అదెప్పుడూ! శివపార్వతులు కామక్రీడలో ఉన్నప్పుడు చెప్పాపెట్టకుండా అలా అకస్మాత్తుగా వచ్చినందుకు శివుడికి కోపం వచ్చింది. అగ్నిపై తన వీర్యాన్ని చల్లుతాడు. ఆ వీర్యం మంటకు అగ్ని తాళలేక పోతాడు. బ్రహ్మను తలచుకుంటాడు. బ్రహ్మ శరవణ సరస్సుకు వెళ్లమని సలహా ఇస్తాడు. అగ్ని అక్కడికి పరుగుతీస్తాడు. తీరా అక్కడేం జరుగుతోంది? సప్తరుషుల భార్యలు జలకాలాడుతున్నారు. ఇకనేం అగ్ని తన మంటలు మరిచిపోయి కామోద్రిక్తుడవుతాడు.
అనూహ్యంగా అక్కడికి వచ్చిన అగ్నినిచూసి, అరుంధతి తక్షణమే బట్టలు చుట్టుకుంటుంది. మిగిలిన ఆరుగురు ఆ పనిచేయరు. పైగా, అగ్నితో కలిసి తృప్తి పొందుతారు. ఆ సమయంలో అగ్ని ఒంటిపై ఉన్నశివుని వీర్యం ఆ ఆరుగురు రుషి భార్యల గర్భంలోకి ప్రవేశిస్తుంది. సృహలోకి వచ్చిన ఆ ఆరుగురు మహిళలు భయంతో తమ తమ గర్భపిండాలను శరవణసరస్సులో తామరాకులపై వదులుతారు. ఎవరి ఇళ్లకు వారు తిరుగుముఖం పడతారు. వారి భర్తలు మహారుషులు కదా? తమ భార్యలు ఏ పనిచేసి వస్తున్నారో మంత్రశక్తివల్ల పసిగడతారు. కోపోద్రిక్తులై వారిని తిరస్కరిస్తారు. ఎంతైనా రుషి పత్నులు శివుని వీర్యాన్ని మోసారు కదా అని బ్రహ్మ కరుణించి, మళ్లీ మధ్యలో కల్పించుకుని వారికి వరం ఇస్తాడు. జ్యోతిర్లోకంలో వారిని కృత్తికలుగా ప్రకాశించమని దీవిస్తాడు. అప్పుడు శరవణసరస్సులో ఆరుగురు రుషుల భార్యలు తామరాకులమీద వదిలేసిన పిండాలు అతక్కుని ఒక్కటై, షణ్ముఖ రూపాన్ని దాలుస్తాయి. ఆ షణ్ముఖ (ఆరుముఖాల) రూపమే కుమారస్వామి అవుతాడు.
ఈ చిన్న కథలోని విషయాల గూర్చి ఆలోచిస్తే మనకు ఏ మనిపిస్తుంది? హిందూపురణాల నిండా అక్రమ లైంగిక సంబంధాలు బాహాటంగా కనిపిస్తాయని తెలుస్తుంది. ప్రపంచంలో ఎక్కడా ఏ ప్రార్థనా స్థలాలలో కనిపించని స్త్రీ, పురుష లైంగిక భంగిమల శిల్పాలు హిందూ దేవాలయాల్లోనే కనిపిస్తాయి.
పురాణాలన్నీ వందల ఏళ్లక్రితం రాయడమైంది. శిల్పాలు కూడా ఆకాలంలోనే చెక్కారు. అప్పటి సమాజ స్థితిగతులను బట్టి అవి ఉనికిలోకి వచ్చాయి. మనం ఈ అత్యాధునిక యుగంలో ఉండి వాటిని తప్పుపట్టాల్సిన పనిలేదు. కానీ, అవి గొప్పవని, అవే మన సంస్కృతీ సంప్రదాయాలని వాటిని పాటిస్తూ ఉండాలని చెప్పే అవివేకులకు కొన్ని విషయాలు స్పష్టం చేయక తప్పదు. ఈ కుమారస్వామి జననంలో ఎక్కడైనా, ఏ మాత్రమైనా వాస్తవం ఉందా? అన్నింటికి అన్నీ అభూత కల్పనలే కదా? అగ్నే మండుతూ ఉండేది. అలాంటి అగ్నిని శివుడి వీర్యం మండిరచిందట. అంటే అది ఇంకా ఎంత వేడిగా ఉండాలి? ఒళ్ళు కాలి గగ్గోలు పెడుతూ శరవణసరసి పారిపోయిన అగ్ని అక్కడ ఆరుగురు మునిపత్నులను ఎలా మోహించాడు. ఒకేసారి ఆరుగురిని ఎలా సంతృప్తి పరిచాడు? సరే ఆ విషయం అలా ఉండనిద్దాంమునిపత్నుల గర్భాల్లో అగ్నిదేవుని వీర్యం ఉండాలిగానీ, అతడి ఒంటిమీద పడిన శివుని వీర్యం ఎలా ప్రవేశించిందీ? పోనీ అది కూడా అలా ఉండనిద్దాం. ఉన్న ఫళాన ఆరుగురి గర్భాల్లో ఆరుపిండాలుఎలా ఏర్పడ్డాయీ? సరే గర్భాల్ని బైటకుతీసి తామరాకులమీద వేయగలిగే సామర్థ్యం వారికి ఎలా వచ్చింది? సరేఅది ఆలా ఉండనిద్దాం.
వేరు వేరు ఆకుల మీద ఉన్న పిండాలు ఏ శక్తి వల్ల దగ్గరయ్యాయి? దగ్గరై ఒక్కటయ్యాయి? ఒక్కటై ఎలా షణ్ముఖుడు ఏర్పడ్డాడూ? ఎక్కడికక్కడ ఇంత మంత్రశక్తా? ఇన్ని మహిమలా? ఇన్నిన్ని అభూత కల్పనలా? కట్టుకథల కంటే అధ్వాన్నంగా, అసందర్భ ప్రేలాపనల్లా, వదరుబోతు మాటల్లా సాగే వీటిని భక్తి శ్రద్ధలతో విని తరించాలా? కనీస ఇంగితంలేని ఈ కట్టుకథలు గొప్ప పురాణాలా? గొప్ప సంప్రదాయ రచనలా? ఆ దేవ దేవుడే స్వయంగా మానవులకు అందించిన మహత్తర జ్ఞాన సాగరాలా? వివేచనపెరిగిన ఆధునికులు వీటిని ఆమోదించాలా? మెదడులేని జడపదార్ధాలు ఆమోదించాల్సిందే! ‘కల్పితగాధలు’ అని చెప్పండిచాలు. ఆమోదించడానికి ఎవరికీ ఏ అభ్యంతరమూ ఉండదు. వందల సంవత్సరాలుగా కోట్లమంది జీవితాల్ని అన్యాయంగా దుర్భరం చేసిన వైదిక మత ప్రభోదకులు అందుకు ఒప్పుకోరు కదా? ఆధునికత పెరుగుతున్నకొద్దీ, చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న మహిళలు చేతి గాజుల్ని, కాలి మట్టెల్ని వదిలేస్తున్నారు. దానివల్ల హిందూ సంప్రదాయం దెబ్బతింటుందని, పురుషుల ఆధిపత్యం తగ్గిపోతుందని మనువాదుల భయం. అందుకే నాడి గురించి, శక్తి గురించి బూటకపు విజ్ఞానం ప్రచారం చేస్తున్నారు. ఈ మతపిచ్చి గాళ్లకు అంత తెలివి ఉంటే కాలి రెండో వేలి నుండి స్త్రీ గర్భాశయానికి వేళ్లే ‘‘నాడి’’ ఏదో స్పష్టంగా చెప్పాలి. వైద్యశాస్త్రం చదువుకున్నవారికి ‘హ్యూమన్ అనాటమీ’ క్షుణ్ణంగా తెలిసి ఉంటుంది. వారికి ఎవరికి తెలియని ఒక ‘నాడి’ ఈ మనువాదులకుఎలా తెలిసిందీ? ఇతరమతాల మహిళలు ఎవరూ మట్టెలు పెట్టుకోరు. మరివారంతా బాగున్నారు కదా? హాయిగా కాపురాలు చేసుకుంటూ, పిల్లల్ని కని పోషించుకుంటున్నారు.
ఆ మహిళలకు లేని మహాద్భుతమైన ఆరోగ్యం, సుఖసంతోషాలు ఈ హిందూ మహిళలకు యేం లభిస్తోందనీ? తాళి, బొట్టు, గాజులు, మట్టెలు వదిలేసి, పైటలు తగిలేసి స్వేచ్ఛగా తిరుగుతున్న స్త్రీవాదుల జీవితాలు సజావుగానే ఉన్నాయి. ఏదేమైనా అబద్దపు సైన్సు చెప్పి భయపెట్టడం దండగ. కాలంతోపాటు మార్పులు సహజం. ఫ్యూడల్ వ్యవస్థ ఇంకా కొనసాగాలని కొందరు తాపత్రయ పడుతుంటారు. వారి కోరిక నెరవేరదు. మనువాదుల అబద్దాల సైన్సును విశ్లేషించుకునే తెలివితేటలు ఇప్పుడు సామాన్య పౌరులక్కూడా ఉన్నాయి!