I.N.D.I.A: డిసెంబర్ 19న ‘ఇండియా’ కూటమి సమావేశం?

I.N.D.I.A: డిసెంబర్ 19న ‘ఇండియా’ కూటమి సమావేశం?
దిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి (INDIA opposition alliance) సమావేశం తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 19న ఆయా పార్టీల నేతలు దేశ రాజధాని దిల్లీలో భేటీ కానున్నట్లు సమాచారం..లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపకమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరగనున్నట్లు కూటమి వర్గాలు తెలిపాయి. అయితే, నేతల అందుబాటును బట్టి సమావేశ తేదీలు మారే అవకాశం ఉందని పేర్కొన్నాయి.మరోవైపు కూటమి (INDIA opposition alliance)లోని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్తో ఉన్న విభేదాలను కాంగ్రెస్ (Congress) పార్టీ పరిష్కరించుకున్నట్లు సమాచారం. దీంతో ఆయన తదుపరి సమావేశానికి హాజరవుతారని తెలుస్తోంది. మధ్యప్రదేశ్లో సీట్ల పంపకం విషయంలో కాంగ్రెస్ తప్పిదాల వల్లే రాష్ట్రంలో ఆ పార్టీ ఓటమి చవిచూడాల్సి వచ్చిందని అఖిలేశ్ విమర్శించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయనే వార్తలు వినిపించాయి..వారం క్రితం వెలువడ్డ పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) ఘోర పరాభవం చవిచూసిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్తో పాటు ఇప్పటి వరకు అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్లోనూ పార్టీ ఓటమిపాలైంది.
తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ను ఓడించి అధికారంలోకి రావడం ఆ పార్టీకి కాస్త ఊరటనిచ్చింది. అయితే, మూడు కీలక రాష్ట్రాల్లో ఓటమితో లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపకం కాంగ్రెస్కు క్లిష్టంగా మారింది..’ఇండియా’ కూటమి (INDIA opposition alliance) నేతల సమావేశం డిసెంబర్ 6నే జరగాల్సి ఉన్నప్పటికీ.. పలు కీలక పార్టీల నేతలు అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడింది. అయితే, కూటమి పార్లమెంటరీ పార్టీ నేతల సమావేశం మాత్రం ఆరోజు యథావిధిగా జరిగింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అలాగే రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో ఎలా ముందుకెళ్లాలనే అంశమూ చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది..