దేశంలోని ఆరు హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు

దిల్లీ: దేశంలోని ఆరు హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియమితులయ్యారు. రాజస్థాన్ హైకోర్టుకు జస్టిస్ మనీంద్ర మోహన్ శ్రీవాస్తవ, అలహాబాద్ హైకోర్టుకు జస్టిస్ అరుణ్ భన్సాలీ, గువాహటి హైకోర్టుకు జస్టిస్ విజయ్ బిష్ణోయ్, ఉత్తరాఖండ్ హైకోర్టుకు జస్టిస్ రితు బహ్రీ, ఒడిశా హైకోర్టుకు జస్టిస్ చక్రధారి శరణ్ సింగ్, మేఘాలయ హైకోర్టుకు జస్టిస్ ఎస్.వైద్యనాథన్ నియమకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేశారు.
దీనికి సంబంధించి కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ అరుణ్ భన్సాలీ, జస్టిస్ విజయ్ బిష్ణోయ్, జస్టిస్ ఎంఎం శ్రీవాస్తవ, జస్టిస్ ఎస్ వైద్యానాథన్, జస్టిస్ చక్రధారి శరణ్ సింగ్, జస్టిస్ రితు బహ్రీలను చీఫ్ జస్టిస్లుగా నియమించాలని గతేడాది నవంబర్లో సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. రాజస్థాన్ హైకోర్టుకు చీఫ్ జస్టిస్గా నియమితులైన జస్టిస్ ఎంఎం శ్రీవాస్తవ ప్రస్తుతం అదే హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. జస్టిస్ అరుణ్ భన్సాలీ, జస్టిస్ విజయ్ బిష్ణోయ్లు ప్రస్తుతం రాజస్థాన్ హైకోర్టులో న్యాయమూర్తులుగా ఉన్నారు. జస్టిస్ రితు బహ్రీ ప్రస్తుతం పంజాబ్-హరియాణా హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. జస్టిస్ చక్రధారి శరణ్ సింగ్ ప్రస్తుతం పట్నా హైకోర్టులో, జస్టిస్ ఎస్ వైద్యనాథన్ ప్రస్తుతం మద్రాస్ హైకోర్టులో జడ్జిలుగా ఉన్నారు.