తాడేపల్లిలో జగన్‌ను కలిసిన అంబటి రాంబాబు

  • చట్టపరంగా కేసులను ఎదుర్కొందాం: జగన్ భరోసా
  • పోలీసుల తీరుపై విమర్శలు – కార్యకర్తలకు ధైర్యం

జ్ఞానతెలంగాణ,ఆంధ్రప్రదేశ్,20.02.2026:

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన అనంతరం పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనపై రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన కేసులు, టీడీపీ శ్రేణులు తన నివాసంపై దాడి చేసి ధ్వంసం చేసిన ఘటన, హత్యాయత్న ఆరోపణలు మరియు పోలీసుల వ్యవహార శైలిపై వివరంగా జగన్‌కు నివేదించారు.

అంబటి రాంబాబుతో పాటు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ నందిగం సురేశ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా జగన్‌ను కలిసి పరిస్థితులపై చర్చించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, పార్టీ నాయకులు తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. చట్టపరమైన మార్గాల్లోనే కేసులను సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించారు. కొందరు పోలీసు అధికారులు కూటమి ప్రభుత్వంలోని పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కొనసాగుతున్న పోరాటంలో ఎలాంటి ఒత్తిళ్లు, వేధింపులు ఎదురైనా ధైర్యంగా నిలవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలు నమ్మకం కోల్పోకుండా ప్రజలకు అండగా నిలవాలని ఆయన భరోసా ఇచ్చారు.

You may also like...

Translate »